న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అతని సహచర ఆటగాడు, స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో చాలా మార్పులు తీసుకొచ్చాడని కొనియాడాడు. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచి టీమ్ రూపురేఖలు మార్చాడని తెలిపాడు. తాజాగా ఈఎస్పీన్ క్రిక్ఇన్ ఫోతో మాట్లాడిన ఇషాంత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'జట్టులోని ప్రతి ఒక్కరికి విరాట్ ఉదాహరణగా నిలిచాడు. టీమిండియాలో ఇంతకు ముందెప్పుడు వినని, కొవ్వు శాతం (ఫ్యాట్ పర్సంటేజ్) గురించి నాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఆటగాళ్లకు ప్రతిభతో పాటు ఫిట్నెస్ కూడా ఉంది. తన కోసం తాను ఏర్పాటు చేసుకున్న నియమాలు సహచర క్రికెటర్ల ఆచరించడం వల్ల జట్టు రూపరేఖలే మారిపోయాయి. ఒకప్పుడు బాగా తింటేనే మైదానంలో రాణిస్తారనేవారు. కానీ విరాట్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా మారిపోయింది.
ఫిట్నెస్ మెయింటేన్ చేస్తేనే అద్భుత ప్రదర్శన ఇవ్వగలమని నిరూపించాడు. నేను కూడా విరాట్ను అనుసరిస్తూ ఆహార నియమాలను మార్చుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ తినడం మానేసాను. నాకు ఎవరూ చెప్పలేదు. కానీ దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఫిట్నెస్పై దృష్టిసారించాలి. ముఖ్యంగా ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ తినకపోవడమే మంచిది.
మ్యాచ్ ఆడేటప్పుడు నేను కేవలం ప్రొటీన్ షేక్ మాత్రమే తీసుకుంటాను. లంచ్ కూడా సాధారణంగా తీసుకొని వాటర్ తాగుతా. ఒకవేళ లంచ్ చేయకుంటే మాత్రం నట్స్, ఆల్మాండ్ మిల్క్, బనానా, ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా'అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా ఇషాంత్ శర్మ తన 100వ అంతర్జాతీయ టెస్టు ఆడాడు. కోహ్లీ కెప్టెన్సీ అందుకున్న తర్వాత 40 టెస్టులాడిన అతను.. 113 వికెట్లు తీసి సత్తా చాటాడు.