రెండో టెస్ట్ ముందు టీమిండియాకు షాక్.. గాయంతో ఇషాంత్ దూరం!!

క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్ గడ్డపై వరుస ఓటములతో సతమతమవుతున్న భారత జట్టుకు గట్టిషాక్ తగిలింది. శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్కు టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది. మరోసారి అతను చీలమండ గాయానికి గురైనట్లు క్రిక్బజ్ పేర్కొంది.
న్యూజిలాండ్ టూర్ ముందు రంజీ ట్రోఫీలో గాయపడ్డ లంబూ.. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఫిట్నెస్ సాధించి తొలి టెస్ట్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో మిగతా బౌలర్లంతా విఫలమైన వేళ అద్బుత బౌలింగ్తో ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అయినా బ్యాటింగ్ వైఫల్యంతో ఈ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో రెండు టెస్ట్ల సిరీస్లో 0-1తో వెనుకంజలో నిలిచింది. ఫలితంగా రెండో టెస్ట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

భారత్కు కష్టమే..
అయితే మంచి ఫామ్లో ఉన్న ఇషాంత్ గాయంతో ఈ మ్యాచ్కు దూరమవ్వడం టీమ్మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్వింగ్, పేస్ అనుకూలించే న్యూజిలాండ్ పిచ్లను ఇషాంత్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్ట్ తరహా పిచ్నే రెండో టెస్ట్కు సిద్దం చేయగా.. ఇషాంత్ సేవలు జట్టు కోల్పోవడం కోహ్లీసేనకు ప్రతికూలంగా మారింది. టెస్ట్ల్లో 300 వికెట్ల క్లబ్కు మూడు వికెట్ల దూరంలో ఉన్న ఇషాంత్.. గాయం కారణంగా మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

20 నిమిషాలే ప్రాక్టీస్..
గురువారం టీమిండియా నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కేవలం 20 నిమిషాలు మాత్రమే బౌలింగ్ చేసిన ఇషాంత్.. ఆ తర్వాత నెట్స్లో కనిపించలేదు. గత చీలిమండ గాయమే తిరగబెట్టడంతో నొప్పితో విలవిలాడిన ఇషాంత్ పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇక లంబూ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఉమేశా? నవదీప్ సైనీ?
ఇషాంత్ గాయం నేపథ్యంలో రెండో టెస్ట్ బరిలోకి రిజర్వ్ బెచ్ పేసర్లు ఉమేశ్ యాదవ్, నవ్దీప్ సైనీలలో ఒకరు అవకాశం దక్కించుకోనున్నారు. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో ఉమేశ్ బౌలింగ్ చేయడం చూస్తుంటే అతనికే అవకాశం దక్కవచ్చు. ఇక సంప్రదాయక ఫార్మాట్లో ఇటీవల అతని ప్రదర్శన కూడా బాగుంది. అయితే విదేశాల్లో మాత్రం అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఓవైపు బుమ్రా, షమీ విఫలమవుతుండటం.. మరోవైపు ఫామ్లో ఉన్న ఇషాంత్ దూరమవడంతో రెండో టెస్ట్లో భారత్ బౌలింగ్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

మరోసారి చర్చనీయాంశమైన ఎన్సీఏ
విదర్భతో రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా జనవరి 20న ఇషాంత్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఎంఆర్ఐ స్కాన్లో ‘గ్రేడ్ త్రీ టియర్'గా తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి, పునరావాస చికిత్స అవసరమని అప్పట్లో వైద్యులు తేల్చారు. దాంతో నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చేరుకున్న ఇషాంత్ అక్కడే కఠోర సాధనతో ఫిట్గా మారి న్యూజిలాండ్ టూర్కు వచ్చాడు. అయితే ఒక్క మ్యాచ్కే అతని గాయం తిరగబెట్టడంతో మరోసారి ఎన్సీఏ వ్యవహారం చర్చనీయాంశమైంది. గతంలో భువనేశ్వర్ కుమార్ కూడా ఇలా వచ్చి అలా దూరమైన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications