
హైదరాబాద్: ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఇషాంత్ శర్మ కౌంటీ క్రికెట్లో ఆడాడు. అలా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లాండ్ గడ్డపై కౌంటీలు ఆడటం బాగా కలిసొచ్చిందని అంటున్నాడు ఇషాంత్. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇషాంత్ ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్లో ఇషాంత్ 5 వికెట్లు దక్కించుకోవడం ఇది 8వ సారి కాగా ఇంగ్లాండ్ గడ్డపై రెండోసారి.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడటానికి ముందు ఇషాంగ్ కౌంటీ క్రికెట్ ఆడాడు. ససెక్స్ తరఫున నాలుగు మ్యాచ్లు ఆడిన అతడు 15 వికెట్లు దక్కించుకోవడంతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. తొలి టెస్టు మూడో రోజు ఆట అనంతరం ఇషాంత్ శర్మ మాట్లాడుతూ...'ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కౌంటీ క్రికెట్ ఆడటం ఎంతో లాభించింది. ఐపీఎల్లో చోటు దక్కకపోవడంతో కొంత నిరాశకు గురయ్యాను. కానీ, ఆ తర్వాత ఏదైనా మన మంచికే అని అనుకున్నాను. కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడుతూ డ్యూక్స్ బాల్స్తో బంతులేయడం నాకు బాగా కలిసొచ్చింది.' అని పేర్కొన్నాడు.
'ఆడినంత కాలం చాలా ఎంజాయ్ చేస్తూ ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాను. కౌంటీల్లో సుమారు 250 ఓవర్లు వేశాను. దేశం తరఫున ఆడటం, కీలకమైన రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్లో ఎడమ చేతి బ్యాట్స్మెన్కు దూరంగా బంతులు వేశాను. కానీ, ఆ తర్వాత బౌలింగ్ కోచ్ వచ్చి స్టంప్స్కు నేరుగా బంతులేయమని చెప్పాడు. దీంతో బంతిని స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేశాను. మంచి ఫలితం రాబట్టాను' అని ఇషాంత్ తెలిపాడు.
'జట్టులో కోహ్లీ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు. జట్టు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటాడు. అతడు ఎంతటి ప్రొఫెషనల్ ఆటగాడో అందరికీ తెలిసిందే. కౌంటీ క్రికెట్లో ఒకసారి 50 పరుగులు చేశాను. ఈ గడ్డపై బ్యాట్తో పరుగులు కూడా చేయగలనన్న నమ్మకం ఉంది. కానీ, ఆ అవసరం రాదని అనుకుంటున్నాను. విరాట్-దినేశ్ కార్తీక్ మ్యాచ్ను ముగించేస్తారు' అని రెండో ఇన్నింగ్స్ గురించి ఆశాభావం వ్యక్తం చేశాడు.