ప్రతీ ఒక్కరూ సాయం చేయండి..
ఈ విషయాన్ని బుధవారం ట్విటర్ వేదికగా లంబూ తెలియజేశాడు. ‘ కరోనాతో దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల్లో నా వంతు సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్కు అందజేశాను. ఈ ఆపత్కాలంతో అందరూ అండగా నిలవడాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఒక్కరు తోచిన సాయం చేయండి. చిన్న చిన్న విరాళాలు అన్ని కలిపితేనే పెద్దవి అవుతాయి'అని ట్వీట్ చేశాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తరహాలోనే ఎంత సాయం చేశామనే విషయం చెప్పకుండా దాచాలని ప్రయత్నం చేశారు. కానీ ఇషాంత్ ట్వీట్కు జత చేసిన బ్యాంక్ రిసిప్ట్ స్క్రిన్ షాట్స్ను నిశితంగా పరిశీలిస్తే వారు సాయం చేసింది రూ. 20 లక్షలని స్పష్టంగా తెలుస్తుంది.
ఇషాంత్ సతీమణి క్రీడాకారిణే..
ఇక ఇషాంత్ భార్య ప్రతిమ జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారిణీ . ప్రతిమా కుటుంబంలో ఐదుగురు టీమిండియా బాస్కెట్బాల్కు ప్రాతినిథ్యం వహించారు.
వాస్తవానికి ఈ కరోనా సమస్య లేకుంటే ఈ సమయానికి ప్రతిష్టాత్మక ఐపీఎల్ జరిగేది. ఇషాంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరపున బరిలోకి దిగేవాడు. ఇక ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన ఇషాంత్.. 97 టెస్టుల్లో 297 వికెట్లు తీశాడు. మరో మూడు వికెట్లు తీస్తే 300 వికెట్ల క్లబ్లో చేరిన మూడో భారత బౌలర్గా రికార్డుకెక్కనున్నాడు. ఇప్పటివరకు ఈ ఘనతను కపిల్ దేవ్, జహీర్ ఖాన్ మాత్రమే సాధించారు.
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రూ.4 లక్షల సాయం..
కరోనా వైరస్ కట్టడి కోసం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కూడా ముందుకు వచ్చాడు. రూ. 4 లక్షలు విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత ఫీల్డింగ్ కోచ్గా 2014 నుంచి కొనసాగుతున్న ఆర్. శ్రీధర్.. తాను ప్రకటించిన రూ. 4 లక్షల విరాళంలో.. రూ. 2 లక్షలు పీఎం కేర్స్ ఫండ్కు, రూ. 1.5 లక్షలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు, రూ. 50 వేలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాడు. 1989 నుంచి 2001 వరకూ హైదరాబాద్ తరఫున శ్రీధర్ 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 15 లిస్ట్-ఎ మ్యాచ్లను ఆడాడు.
ఇప్పటికే క్రికెటర్లు రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షలు విరాళం ప్రకటించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సంయుక్తంగా రూ. 3 కోట్లు విరాళం అందజేసిన వియం తెలిసిందే.