'వన్డేల్లో రోహిత్ చాంపియన్ కావొచ్చు.. ఆ విషయంలో మాత్రం సెహ్వాగ్ కంటే వెనుకంజలోనే'

ఢిల్లీ: వన్డేల్లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఓ చాంపియన్ అని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. టెస్టుల్లో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లా.. ప్రస్తుతం రోహిత్ శర్మ అదరగొట్టగలడన్నాడు. అయితే టెస్టుల్లో సెహ్వాగ్ ఆడినన్ని మ్యాచ్లు రోహిత్ ఆడలేకపోవచ్చని, ఆ విషయంలో మాత్రం హిట్మ్యాన్ వెనుకంజలోనే ఉంటాడని ఇర్ఫాన్ అన్నాడు. సెహ్వాగ్ టెస్ట్ ఫార్మాట్లో 100 మ్యాచ్లు ఆడగా.. రోహిత్ అన్ని టెస్టులు ఆడతాడా అనే సందేహం ఇర్ఫాన్ వెలిబుచ్చాడు.

సెహ్వాగ్లా ప్రభావం చూపగలడు
ఇర్ఫాన్ పఠాన్ తాజాగా స్టార్స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ యూట్యూబ్ ఛానల్లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్తో మాట్లాడుతూ... 'వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ నుంచి మనం టెస్టుల్లోనూ ద్విశతకాలను చూడాలి. అతడు భవిష్యత్తులో ఇంకా చాలా మ్యాచ్లు ఆడతాడు. రోహిత్ మంచి ఫిట్నెస్తో కొనసాగితే.. వీరేంద్ర సెహ్వాగ్లా ప్రభావం చూపగలడు. అతడు టెస్టుల్లో ఓపెనర్గా ఆడడం ఇటీవలే ప్రారంభించాడు. ఓపెనర్గా టెస్టు క్రికెట్లో అతడు విభిన్నంగా కనిపిస్తున్నాడు. టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా ఉన్నంత కాలం రోహిత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు' అని అన్నాడు.

అన్ని టెస్టులు ఆడతాడా?
'రోహిత్ శర్మ సుదీర్ఘంగా ఆడే విషయంపైనే అన్ని ఆధారపడి ఉంటాయి. వీరేంద్ర సెహ్వాగ్ 100 టెస్టులు ఆడాడు. రోహిత్ అన్ని టెస్టులు ఆడతాడా అనే విషయంపై సందేహం తలెత్తుతుంది. అయితే వన్డేల్లో మాత్రం రోహిత్ ఓ చాంపియన్. నా టాప్-3 బ్యాట్స్మెన్లో రోహిత్ కచ్చితంగా ఉంటాడు' అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. టెస్టుల్లో 2013లోనే అరంగేట్రం చేసిన రోహిత్.. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తూ రాణించలేకపోయాడు. గతేడాది ఓపెనర్గా మారి సుదీర్ఘ ఫార్మాట్లోనూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

తొలి మ్యాచ్లోనే రెండు శతకాలు
టెస్టుల్లో ఓపెనర్గా గతేడాదే అవతారమెత్తిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్ల్లో అద్భుతంగా ఆడాడు. టెస్టు ఓపెనర్గా తొలి మ్యాచ్లోనే రెండు శతకాలు బాదిన తొలి బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు. ఒక ద్విశతకం కూడా బాదాడు. గతంలో టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ అనేకసార్లు దూకుడుగా ఆడి భారత జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. ఇప్పుడు రోహిత్ కూడా అలాంటి పాత్రే పోషిస్తున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో రోహిత్ ఇప్పటివరకు 32 టెస్టుల్లో, 224 వన్డేల్లో, 108 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఒక్క కిక్ ఇస్తే
అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... టీమిండియా యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ను ఒకసారి మందలిస్తేనే మెరుగవుతాడన్నాడు. 'రిషబ్ పంత్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి యంగ్ క్రికెటర్, చాలా టాలెంట్ ఉన్న ఆటగాడిగా అందరూ అంటున్నారు. దాంతో అతనిపై అంచనాలు పెరిగిపోతూవచ్చాయి. ఒక్కసారి దృష్టి సారించడం మానేస్తే అది అతడికే మంచి చేస్తుంది. స్వేచ్ఛగా రాణించే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ అతిగా రిషబ్ పంత్కి మద్దతు ఇవ్వడంతో అందరి చూపు కూడా పంత్పై నిలిచింది. ఇప్పటికీ పంత్కి వెనుకవైపు నుంచి కోహ్లీ లేదా మేనేజ్మెంట్ ఒక్క కిక్ ఇవ్వగలిగితే దారిలోకి వస్తాడు. ఒకవేళ నిజంగా యువ క్రికెటర్కు మంచి నైపుణ్యం ఉంటే అప్పుడు కచ్చితంగా రాణిస్తాడు' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
సీపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల.. రెండు స్టేడియాల్లోనే 33 మ్యాచ్లు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications