
ట్రినిడాడ్: వెస్టిండీస్ గడ్డపై ప్రతి ఏడాది జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) పూర్తి షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు సీపీఎల్ జరగనుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సోమవారం వెల్లడించింది. లీగ్లో మొత్తం 33 మ్యాచ్లు జరుగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో ఈ సీజన్ జరుగనుంది. వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది సీపీఎల్ జరగడంపై తొలుత సందిగ్ధత నెలకొనగా.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తాజాగా పూర్తి స్థాయి షెడ్యూల్ని విడుదల చేసింది.
కరోనా వైరస్ ప్రవేశం తర్వాత జరిగే తొలి ప్రైవేట్ టీ20 లీగ్ ఇదే కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సెప్టెంబర్ 19న యూఏఈలో ప్రారంభం కానుంది. కాగా సీపీఎల్లో ఆగస్టు 18న ట్రిన్బాగో నైట్ రైడర్స్, గుయానా ఆమెజాన్ వారియర్స్ మధ్య తొలి పోరు జరుగనుంది. 33 మ్యాచ్ల ఈ లీగ్ ఫైనల్ సెప్టెంబరు 10న జరగనుంది. వైరస్ కారణంగా కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే ఈ లీగ్ని నిర్వహిస్తామని విండీస్ బోర్డు స్పష్టం చేసింది.
తరుబాలోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం.. సెమీ ఫైనల్, ఫైనల్తో పాటు మొత్తం 23 మ్యాచ్లకి ఆతిథ్యమివ్వనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని క్వీన్ పార్క్ ఓవల్ స్టేడియంలో మిగిలిన 10 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది సీజన్ కాస్త విభిన్నంగా కనిపించినా ప్రమాణాలు మాత్రం అత్యుత్తమంగానే ఉంటాయని సీపీఎల్ సీఈవో డామీన్ డొనోహోయ్ అన్నాడు. సీపీఎల్లో మొత్తం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. 2013 నుంచి సీపీఎల్ జరుగుతుండగా.. ఐపీఎల్ తరహాలో ఈ టోర్నీ క్లిక్ కాలేదు. కానీ ఆర్థికంగా బాగా వెనుకబడిన విండీస్ బోర్డుకి మాత్రం కాస్త ఊరటనిస్తోంది.
వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సీపీఎల్ 2020 నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల కారణంగా సీపీఎల్ 2020లో ఆడట్లేదని 40 ఏళ్ల గేల్ ప్రకటించాడు. అయితే జమైకా తలైవాస్ టీమ్ ఫ్రాంఛైజీతో గొడవ కారణంగా ఈ ఏడాది సీపీఎల్కి దూరంగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది గేల్ సెయింట్ లూసియా జూక్స్ ప్రాంచైజీ తరఫున ఆడనున్నట్లు గత ఏప్రిల్లో ఒప్పందం చేశాడు. 2013 నుంచి సీపీఎల్ టోర్నీ ఆడుతున్న జమైకా వీరుడు గేల్.. 2,344 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.