హైదరాబాద్: టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీని, విరాట్ కోహ్లీని ఇప్పటి వరకూ ఎప్పుడూ కలవలేదని, వారిని టీవీలో మాత్రమే చూశానని అంటున్నాడు ఐర్లాండ్ క్రికెటర్ సిమీ సింగ్. వాస్తవానికి భారతీయుడే అయినా ఐర్లాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. క్రికెట్లో కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో సిమి సింగ్ పంజాబ్ తరఫున క్రికెట్ ఆడాడు. అవకాశాలు రాకపోవడంతో ఐర్లాండ్ వెళ్లిపోయాడు.
అక్కడ స్థానికంగా జరిగే టోర్నమెంట్లలో బాగా రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో భారత్తో జరగబోయే టీ20 సిరీస్లో సిమి సింగ్ ఐర్లాండ్ తరఫున ఆడబోతున్నాడు. 2006లో సిమి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివేందుకు ఐర్లాండ్ వెళ్లాడు. ఈ సందర్భంగా సిమీ తన అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించాడు.
'మొహాలీలో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటుంటేవాడిని. కానీ, పంజాబ్ తరఫున క్రికెట్ ఆడే సమయంలో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో నేను చదువు కోసం ఐర్లాండ్ వెళ్లిపోయాను. కానీ, ఇప్పుడు ఐర్లాండ్ జాతీయ జట్టు తరఫున ఆడుతున్నాను. ఐర్లాండ్ వచ్చినప్పటి నుంచి నేను ఏ క్రికెట్ మైదానంలో అయితే ప్రాక్టీస్ చేశానో, చిన్నారులకు శిక్షణ ఇచ్చానో ఇప్పుడు అదే మైదానంలో భారత్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్లు జరగబోతున్నాయి.'
'ఇదో గొప్ప అనుభూతి. నా కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటి వరకు నేను మహేంద్ర సింగ్ధోనీ, విరాట్ కోహ్లీని కలిసింది లేదు. టీవీలో వారు ఆడుతుంటే చూశాను అంతే. చండీగఢ్లో నేను కాలేజీలో చదివే సమయంలో చాహల్, సిద్ధార్థ్ కౌల్తో కలిసి ఆడాను. ఇప్పుడు ఐర్లాంట్ పర్యటనకు ఆ ఇద్దరూ వచ్చారు. భారత జట్టుతో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని సిమి తెలిపాడు. జూన్ నెల 27, 29న భారత్-ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన ఐర్లాండ్కు శనివారమే తరలివెళ్లింది.