అక్టోబర్ 17న వేలం
ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచులు యూఏఈలో సెప్టెంబర్ 19న ఆరంభం అయి అక్టోబర్ 15తో ముగియనున్నాయి. ఈ లోపే రెండు కొత్త జట్లకు సంబందించిన అన్ని పనులను బీసీసీఐ పూర్తిచేయనుంది. అనంతరం అక్టోబర్ 17న రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ వేలం నిర్వహించనుందని సమాచారం తెలుస్తోంది.
అయితే ప్రతి బిడ్డర్ రూ. 2500 కోట్ల నికర విలువ మరియు రూ .3000 కోట్ల టర్నోవర్ను చూపించాల్సి ఉంటుంది. రెండు కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఐపీఎల్ 2022 టెండర్ పత్రం సెప్టెంబర్ నెలాఖరులో విడుదల కానుందని తెలుస్తోంది. ఇక డిసెంబర్ మాసంలో మెగా యాక్షన్ జరగనుందని సమాచారం.
లక్నో జట్టుపై కన్నేసిన సంజీవ్ గోయెంకా
గతంలోనూ ఐపీఎల్ లీగ్లో పది జట్లు ఉన్న సంగతి తెలిసిందే. 2011లో 10 జట్లతో లీగ్ నిర్వహించారు. 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది. ఇప్పుడు 2022లో 10 జట్లు ఆడనున్నాయి. కొత్త ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రముఖ బిజినెస్ మేన్ సంజీవ్ గోయెంకా ఆధ్వర్యంలోని ఆర్పీఎస్జీ కొత్త ఐపీఎల్ జట్టును కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. లక్నో జట్టుపై ఆర్పీఎస్జీ ఆసక్తి కనబరుస్తోంది. గతంలో రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు సంజీవ్ గోయెంకా యజమాని అన్న సంగతి తెలిసిందే.
రేసులో మోహన్ లాల్
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కూడా కొత్త ఐపీఎల్ జట్టు రేస్లో ప్రధానంగా ఉంది. ఐపీఎల్లో జట్టును సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను అదానీ గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లో ఉండడం.. ఆ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్న అదానీ గ్రూప్నకు కలిసి రానుంది. మలయాళ 'సూపర్ స్టార్' మోహన్ లాల్ కూడా బరిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే బైజూస్ సంస్థతో కలిసి ఆయన కొత్త జట్టును కొంటాడా? లేదా సొంతంగానే తీసుకుంటాడనే విషయంపై స్పష్టత లేదు. వీరితో పాటు బడా బిజినెస్ మేన్, నిర్మాతలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని మ్యాచులతో
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్ను 10 జట్లకు పెంచాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. ఐపీఎల్ 2021 నుంచే 10 జట్లను ఆడించాలని బీసీసీఐ చూసినా.. సమయం లేకపోవడంతో అది కుదరలేదు. వచ్చే ఏడాది మాత్రం బీసీసీఐ ప్రయత్నాలు సఫలం కానున్నాయి. మొత్తానికి ఐపీఎల్ మరిన్ని మ్యాచులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సీజన్ నుంచి రెండు జట్లు చేరనుండడంతో బీసీసీఐకి భారీ ఆదాయం కూడా రానుంది.
ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే
ఐపీఎల్ 15వ సీజన్లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం. ప్రస్తుతం కంటే 1000, 15000 కోట్లు అదనంగా ఆదాయం రానుందని సమాచారం తెలుస్తోంది. ఇక మెగా వేలానికి ముందు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశంను ప్రాంచైజీలకు బీసీసీఐ ఇవ్వనుందట. ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) ద్వారా మరో ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఈ విషయంపై బీసీసీఐ నవంబర్ నాటికి స్పష్టత ఇవ్వనుంది. ఐపీఎల్ 2022కి సంబంధించి పూర్తి సమాచారం త్వరలోనే బీసీసీఐ వెల్లడించనుంది.