చెన్నై: ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియా యువ పేసర్ జై రిచర్డ్సన్ జాక్ పాట్ కొట్టాడు. ఊహించని విధంగా రూ. 14 కోట్ల భారీ ధర పలికాడు. రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆసీస్ పేసర్ను పంజాబ్ కింగ్స్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. రిచర్డ్సన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడటంతో ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది.
ఇక రిచర్డ్సన్కు ఇదే ఫస్ట్ ఐపీఎల్ సీజన్. ఇటీవల ముగిసిన బిగ్బాష్ లీగ్లో అతను పెర్త్ స్కార్చర్స్ తరఫున అదరగొట్టాడు. 16.31 యావరేజ్తో 29 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన జై రిచర్డ్సన్ ఇప్పటి వరకు ఆసీస్ తరఫున 2 టెస్ట్లు, 13 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
ఐపీఎల్ తాజా వేలంలో ఆల్రౌండర్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. క్రిస్ మోరీస్ రూ.16.25 కోట్ల భారీ ధరకు రాజాస్థాన్ రాయల్స్కు అమ్ముడుపోగా.. స్టీవ్ స్మిత్ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, గ్లేన్ మ్యాక్స్వెల్ను రూ. 14.25 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకున్నాయి. పియూష్ చావ్లాను ముంబై ఇండియన్స్ 2.4 కోట్లకు తీసుకుంది. మొయిన్ అలీ (రూ.7 కోట్లు), శివమ్ దూబె (రూ.4.4 కోట్లు), షకిబ్ అల్ హసన్ (3.2 కోట్లు)కు భారీ ధర పలికింది.