IPL 2022 ముందు.. సిరాజ్తో సహా ఆ నలుగురిని వదిలేయనున్న ఆర్సీబీ!

హైదరాబాద్: గత 15 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. కనీసం ఇటీవల ముగిసిన సీజన్లోనైనా ఆర్సీబీ టైటిల్ ముద్దాడుతుందని భావించినా.. ఆ జట్టు రెండు అడుగుల దూరంలో నిలిచిపోయింది. అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరి ఎలిమినేటర్ అడ్డంకి ధాటినా.. క్వాలిఫయర్ 2 రూపంలో దురదృష్టం వెంటాడింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో సమష్టిగా విఫలమై ఇంటిదారి పట్టింది. అయితే ఈ సీజన్లో అన్ని విభాగాల్లో బాగానే రాణించినప్పటికీ.. ఒక బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. స్పిన్నర్ హసరంగా వికెట్లు తీయడంతో ఆ లోటు పెద్దగా కనబడలేదు కానీ.. జట్టుకు జరగాల్సిన నష్టం జరిగింది.
వచ్చే సీజన్కు ఆ జట్టు ఈ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేయనుంది. కేవలం మినీ వేలం జరిగే అవకాశం ఉంది కాబట్టి జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కానీ ఓ నలుగురి ఆటగాళ్లకు మాత్రం గుడ్ బై చెప్పే అవకాశం ఉంది.

మహమ్మద్ సిరాజ్..
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు మహమ్మద్ సిరాజ్ను ఆర్సీబీ రూ.7 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో నిలకడగా రాణించడంతో పాటు టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చడం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు ఉండటంతో ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకుంది. హర్షల్ పటేల్ను కాదని మరీ సిరాజ్ను అంటిపెట్టుకున్నారు. కానీ అతను మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. 15 మ్యాచ్లు ఆడిన అతను 9 వికెట్లు మాత్రమే తీసాడు. 10.08 ఎకానమీతో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతోనే సిరాజ్ను ఆర్సీబీని పక్కనపెట్టే అవకాశం ఉంది.

డేవిడ్ విల్లే..
మెగా వేలంలో 2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన డెవిడ్ విల్లే ఆశించిన రీతిలోరాణించలేకపోయాడు. ఆరంభంలో అవకాశం దక్కినా.. గ్లేన్ మ్యాక్స్వెల్ రాకతో బెంచ్కే పరిమితమయ్యాడు. రెండు మ్యాచ్లు ఆడిన విల్లే కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. అయితే నలుగురి ఫారిన్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో విల్లేకు చోటు దక్కడం కష్టంగా మారింది. దాంతో విల్లేను వదిలేయాలనే ఆలోచనలో ఆర్సీబీ ఉంది.

షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్..
షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్ది కూడా విల్లే పరిస్థితే. తుది జట్టులో చోటు దక్కడం ఈ విండీస్ ఆల్రౌండర్కు కష్టంగా మారింది. గ్లేన్ మ్యాక్స్వెల్ను కాదని అతన్ని ఆడించే సాహసం ఆర్సీబీ చేయదు. ఆరంభ మ్యాచ్ల్లో అవకాశం అందుకున్న రూథర్ ఫోర్డ్.. కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్సీబీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

అనూజ్ రావత్..
ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ను కూడా ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రావత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 16.13 సగటుతో కేవలం 129 పరుగులే చేశాడు. ఒక్క ముంబై ఇండియన్స్తో 47 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మిగతా మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టిన ఆర్సీబీ కోహ్లీని ఓపెనర్గా ఆడించి రజత్ పటీదార్ను జట్టులోకి తీసుకుంది. ఇక పటీదార్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అజేయ సెంచరీతో ఎలిమినేటర్ మ్యాచ్లో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ క్రమంలోనే అనూజ్ రావత్ సేవలు జట్టుకు అవసరం లేకుండా పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications