ముంబై-ఢిల్లీ
ఈ సీజన్లో తొలిసారిగా వరుసగా రెండు మ్యాచ్లల్లో నెగ్గింది. కీలకం అనుకున్న ప్రతీసారి విజయాన్ని అందుకుంది ఢిల్లీ కేపిటల్స్. ప్రస్తుతం 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలేవుందా జట్టుకు. ముంబై ఇండియన్స్తో తన చిట్టచివరి మ్యాచ్ను ఆడబోతోంది ఢిల్లీ కేపిటల్స్. ఈ శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ముంబై వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్లో గనక ఢిల్లీ కేపిటల్స్ గెలిచిందీ అంటే.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు దూసుకెళ్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
సన్రైజర్స్పై ఫోకస్..
ప్రస్తుతం అందరి దృష్టీ ఇవ్వాళ జరిగే సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్పై నిలిచింది. ముంబై ఇండియన్ మాటెలా ఉన్నప్పటికీ- సన్రైజర్స్కు మాత్రం ఇది గెలిచి తీరాల్సిన మ్యాచ్. ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారిందీ జట్టు. ముంబైపైనా ఓడితే ఇక ఇంటిదారి పట్టడమే. చిట్టచివరి లీగ్ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. అందులో గెలిచినా ప్లేఆఫ్స్ చేరదు. ఆ గెలుపు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ముంబై, పంజాబ్ను ఓడించి..
అందుకే ఇవ్వాళ్టి ముంబై ఇండియన్స్పై జరిగే మ్యాచ్తో పాటు పంజాబ్ కింగ్స్నూ ఓడించాల్సి ఉంటుంది.. అది కూడా మెరుగైన రన్రేట్తో. ముంబై ఇండియన్స్ మ్యాచ్తో పాటు.. పంజాబ్ కింగ్స్ను ఓడించగలిగితేనే 14 పాయింట్లు సాధించగలుగుతుంది. అప్పటికీ ప్లేఆఫ్స్ చేరుతుందనడానికి నో గ్యారంటీ. ఇతర జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సి వస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కత నైట్రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్.. ఇలా కాంపిటీటర్స్ అందరూ ఓడాలి మరి.
కోల్కత త్యాగం చేయాలి..
సన్రైజర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే- కోల్కత నైట్రైడర్స్ త్యాగం చేయాల్సి ఉంటుంది. తన చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడాల్సి ఉంది నైట్రైడర్స్కు. ఈ మ్యాచ్లో కోల్కత ఓడిపోవాల్సి ఉంటుంది. అలా జరిగితే- కోల్కత జట్టు ప్రయాణం 12 పాయింట్ల వద్దే నిలుస్తుంది. ఒకవేళ కోల్కత గెలిచినా.. అది తక్కువ మార్జిన్తో అయి ఉండాలి. తక్కువ రన్రేట్తో గెలిస్తే- సన్రైజర్స్కు ఢోకా ఉండదు. ఆ రన్రేట్ సన్రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసేదిగా ఉండకూడదు.
ఆర్సీబీ సైతం ఓడాల్సిందే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా తన చివరి లీగ్ మ్యాచ్లో ఓడిపోవాలి. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ ఫైట్ చేయనుంది.. రాయల్ ఛాలెంజర్స్. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ గెలిస్తే- సన్రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టతరమౌతాయి. దీనికి కారణం- ఆ జట్టు 16 పాయింట్లతో ముందంజ వేస్తుంది కాబట్టి. ఇప్పటికే 14 పాయింట్లు సాధించినందున మెరుగైన నెట్ రన్రేట్తో సన్రైజర్స్ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదమూ లేకపోలేదు.