ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఇంకో ఎనిమిది రోజుల్లో లీగ్ దశ ముగియబోతోంది. ఈ టోర్నమెంట్లో పాల్గొంటోన్న జట్లన్నీ చివరి మ్యాచ్లు ఆడబోతున్నాయి. అది కూడా రెండు-మూడు కంటే ఎక్కువ మ్యాచ్లు లేవు. ఈ నెల 22వ తేదీ నాటికి లీగ్స్ ముగుస్తాయి. చిట్టచివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనున్నాయి. ఇక ప్లేఆఫ్స్ సందడి మొదలవుతుంది. 24, 25 తేదీల్లో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ ఉంటుంది.
27న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ను షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. రెండు రోజుల విశ్రాంతి తరువాత అంటే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. గుజరాత్ అహ్మదాబాద్ శివార్లలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్స్ తరువాత- భారత క్రికెట్ జట్టు ఇంటర్నేషనల్ మ్యాచ్లను ఆడుతుంది. అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఈ సిరీస్ కోసం ప్రొటీస్.. భారత పర్యటనకు రానుంది.
కాగా- ఇదే ఏడాది బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఐపీఎల్ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనుంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తరువాత ఈ దిశగా తక్షణ చర్యలు ఆరంభిస్తుందని సమాచారం. వచ్చే సంవత్సరం పురుషుల ఐపీఎల్తో పాటు.. మహిళల టోర్నమెంట్ కూడా నిర్వహించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటుందని అంటున్నారు.
మహిళల ఐపీఎల్ టోర్నమెంట్కు ఏ స్థాయిలో అభిమానుల నుంచి ఆదరణ లభిస్తుందో తెలియట్లేదు గానీ- రాజస్థాన్ రాయల్స్ ఈ దిశగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విమెన్స్ ఐపీఎల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నామంటూ రాజస్థాన్ రాయల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫసీర్ జేక్ లుష్ మెక్రమ్ చెప్పారు. మహిళా ఐపీఎల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. మహిళల క్రికెట్ అంటే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.
వెలుగులోకి రాని పలువురు మహిళా క్రికెటర్లకు ఇలాంటి ఫార్మట్.. ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగకరమని వ్యాఖ్యానించారు. పురుషులతో సమానంగా ఐపీఎల్ టోర్నమెంట్లల్లో మహిళలు రాణించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా తాము రాజస్థాన్ రాయల్స్ తరఫున మహిళా ఐపీఎల్ ఫ్రాంఛైజీని ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పారు. మహిళ క్రికెటర్లు దేశం కోసం ఎంతో కమిట్మెంట్తో ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.