హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచి తమ అభిమానులను సంతోషపరుస్తామని సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. అయితే టైటిల్ గెలవడం అంత సులవైన పనికాదనే విషయం తమకు తెలుసని, మరింత కష్టాపడాల్సి ఉంటుందని చెప్పాడు. అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో జట్టుతో చేరిన భువనేశ్వర్ కుమార్ టీమ్ టీవీతో మాట్లాడాడు. మళ్లీ జట్టులోకి రావడం సంతోషంగా ఉందన్నాడు.
'మళ్లీ సన్రైజర్స్ జట్టులో చేరడం సంతోషంగా ఉంది. కొత్త ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని కలిసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈసారి అభిమానులకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావిస్తున్నాం. వారి ముఖాలపై చిరునవ్వులు పూయించాలన్నదే మా లక్ష్యం. వ్యక్తిగతంగా నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలేమీ లేవు. సమష్టి కృషితో ముందుకు సాగి ఈ సారి ట్రోఫీ గెలవాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఇదంతా సులువుగా అయ్యే విషయం కాదని తెలుసు. మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా అభిమానులను ఖుషీ చేయడానికి శక్తిమేర ప్రయత్నిస్తాం.'భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.
He's all about the footwork. 👟🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/X16dQhgS81
— SunRisers Hyderabad (@SunRisers) March 17, 2022
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా.. అతని పేలవ ఫామ్ నేపథ్యంలో వదిలేసింది. వేలంలో తమ ప్రణాళికలు గతి తప్పడంతో దిక్కులేక మళ్లీ భువీనే తీసుకుంది. సన్రైజర్స్ టీమ్లోకి వచ్చిన వేళ విశేషమో ఏమో కానీ ఇటీవల భారత జట్టు తరఫున అతను మళ్లీ అదరగొట్టాడు. విండీస్, శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లో సూపర్ బౌలింగ్తో మెరిసాడు. ఇక మార్చి 29 న విలియమ్సన్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా 2016లో సన్రైజర్స్.. ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.