
అదిరే ఆరంభాలతో ఆనందం..
'రెండు ఇన్నింగ్స్ల్లో పిచ్ బౌలింగ్కు అనుకూలించింది. వికెట్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ మా ఓపెనర్లు శిఖర్, పృథ్వీ షా అద్భుతంగా ఆడారు. వారు ధాటిగా ఆరంభించడం కలసి వచ్చింది. ప్రతి మ్యాచులో గొప్ప ఆరంభాలే లభిస్తుంటే ఎవ్వరికైనా సంతోషంగానే ఉంటుంది. చాలా ఇబ్బందులను పరిష్కరించుకున్నాం. కోల్కతా వేదికలో మరికొన్ని ప్రయోగాలు చేస్తాం. ప్రస్తుతం పోటీ బాగుంది. మాకు వేగంగా బంతులతో దాడిచేసే బౌలింగ్ బృందం ఉంది. అయితే, అందరినీ ఆడించడం కష్టం. సారథ్యాన్ని ఆస్వాదిస్తున్నా. ప్రతి రోజూ నేర్చుకుంటున్నా. అందరూ నాకు సాయం చేస్తున్నారు.'అని పంత్ చెప్పుకొచ్చాడు.

మరో 10 రన్స్ చేసుండాల్సింది..
ఈ మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు వస్తే బాగుండేదని పంజాబ్ కింగ్స్ తాత్కలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..బ్యాటింగ్లో మరో 10-20 పరుగులు ఎక్కువ చేసుండాల్సిందన్నాడు. 'కేఎల్ రాహుల్కు శస్త్రచికిత్స జరగనుంది. అతడు పునరాగమనం చేస్తాడని ధీమాగా ఉన్నాం. ఈ రెండు పాయింట్లు వస్తే బాగుండేది.
కానీ, మేం కనీసం పది పరుగులు తక్కువే చేశాం. పవర్ప్లేలో ఢిల్లీ అద్భుతంగా ఆడింది. మాలో ఎవరో ఒకరు చివరి వరకు బ్యాటింగ్ చేయాలన్నది ప్రణాళిక. ఇది నారోజు. ఆఖర్లో ధాటిగా ఆడినప్పటికీ మధ్య ఓవర్లలో పరుగులు చేయలేకపోయాం. ఏదేమైనా ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలి. గెలుపు గురించి ఆలోచించాలి. హర్ప్రీత్ చక్కని బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. మేం సమష్టిగా రాణించాలి. తర్వాత మ్యాచులో అలా ఆడతామని అనుకుంటున్నా.'అని మయాంక్ తెలిపాడు. ఈ మ్యాచ్లో 99 పరుగులతో అజేయంగా నిలిచిన మాయంక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

పృథ్వీతో నా పని ఈజీ..
పిచ్ను బట్టి తన బ్యాటింగ్ ఉంటుందని ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. పృథ్వీ షా తన ధాటైన ఇన్నింగ్స్లతో ఒత్తిడి తగ్గిస్తున్నాడని చెప్పాడు. 'లక్ష్యాన్ని ఛేదించిన విధానం పట్ల సంతోషంగా ఉన్నాం. పృథ్వీ, నేనూ గొప్ప ఆరంభాలు ఇస్తున్నాం. స్మిత్ బాగా ఆడాడు. నేను ఆఖరి వరకు ఉండాలని తెలుసు. మంచి ఇన్నింగ్స్ నిర్మించడాన్ని ఆస్వాదిస్తాను.
లక్ష్యానికి చేరువ కాగానే 19 ఓవర్లో మ్యాచును ముగించాలని అనుకున్నాం. కానీ హెట్మైర్ 18వ ఓవర్లోనే ముగించేశాడు. అతను బంతిని అద్భుతంగా బాదాడు. రన్రేట్ పెంచినందుకు సంతోషం. ఎందుకంటే విజయాలతో పాటు రన్ రేట్ సైతం కీలకమే. మనం పిచ్ను కచ్చితంగా గౌరవించాల్సిందే. అందుకే వికెట్ను బట్టి నా ఆట ఉంటుంది. పృథ్వీతో మూడేళ్లుగా కలిసి ఆడుతున్నా. అతడు నా పనిని ఈజీ చేస్తాడు.'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

అలవోకగా..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్(58 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 99 నాటౌట్), డేవిడ్ మలాన్(26) మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 167 రన్స్ చేసి 14 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. శిఖర్ ధావన్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా పృథ్వీ షా(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39), షిమ్రాన్ హెట్మైర్(4 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో రిలే మెరిడిత్, క్రిస్ జోర్డాన్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications
