
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్కు మరికొద్ది గంటల్లో తెరలేవనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తమ జట్టులో కీలక మార్పు చేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఆడలేనని తప్పుకున్న ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ స్థానంలో మరో ఆస్ట్రేలియా పేసర్ జేసన్ బెరెండార్ఫ్ను తీసుకుంది. ఈ విషయాన్ని సీఎస్కేనే ట్విటర్ వేదికగా శుక్రవారం వెల్లడించింది. ఈ సమ్మర్ ఐపీఎల్ 2021లో భాగమయ్యేందుకు జేసన్ బెరెండార్ఫ్ సూపర్ లయన్ టీమ్తో కలిసాడనే క్యాప్షన్తో ట్వీట్ చేసింది.
2019లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన బెరెండార్ఫ్.. ఆ జట్టు తరఫున కేవలం ఐదు మ్యాచ్లు ఆడాడు. ఈ 5 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. అనంతరం ఈ ఆసీస్ పేసర్ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకురాలేదు. ఇక ఆస్ట్రేలియా తరఫున 11 అంతర్జాతీయ వన్డేలతో పాటు 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 16, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు.
మెగాటోర్నీలకు సన్నదం కావడంలో కోసమే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు హేజిల్ వుడ్ పేర్కొన్నాడు. 'ఈ ఏడాది కీలకమైన టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ ఉన్నాయి. దాంతో దాదాపు 10-12 నెలలు బయో-బబుల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే నా కుటుంబంతో సమయం గడపాలని ఆశిస్తున్నా. టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ కోసం మానసికంగా, శారీరకంగా నాకు నేను సిద్ధమవ్వాలి. అందుకే ఐపీఎల్ 2021 సీజన్కి దూరమవుతున్నా. చెన్నై సూపర్ కింగ్స్ బాగా ఆడుతుందని ఆశిస్తున్నా. కప్ గెలవాలని కోరుకుంటున్నా' అని జోష్ హేజిల్వుడ్ అన్నాడు.

ఐపీఎల్ 2020 సీజన్లో జోష్ హేజిల్వుడ్ని రూ.2 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఐపీఎల్ 2021 సీజన్కి కూడా అదే ధరకి రిటైన్ చేసుకుంది. గత సంవత్సరం ఏ ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా రాణించలేదు. సామ్ కరన్ పర్వాలేదనిపించగా.. లుంగీ ఎంగిడి, దీపక్ చహర్ పూర్తిగా విఫలమయ్యారు. మరీ ఈసారి ఏం చేస్తారో చూడాలి. శనివారం జరిగే లీగ్ సెకండ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక కానుంది.