ముంబై: ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్ యువ ప్లేయర్ రియాన్ పరాగ్ దుమ్మురేపాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి ధనాధన్ షాట్లతో మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లోనే 3 సిక్స్లతో 25 రన్స్ చేసి కెప్టెన్ సంజూ శాంసన్ విరోచిత పోరాటానికి అండగా నిలిచాడు. కానీ విజయానికి సమీపించిన వేళ పరాగ్ ఔటవ్వడం.. సెంచరీ హీరో శాంసన్ మ్యాచ్ ఫినిష్ చేయకపోవడంతో రాజస్థాన్ రాయల్స్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడినా.. అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ ఓటమి అనంతరం రాజస్థాన్ మరోపోరుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యమే మ్యాచ్లో బలమైన ఢిల్లీ క్యాపిటల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో క్రిక్బజ్తో చిట్ చాట్ చేసిన రియాన్ పరాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా తనకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన సరదా సంభాషణను గుర్తు చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ ఎలా సాధించాలని మదన పడుతున్న తనకు విలువైన సలహా ఇచ్చాడని, టీమ్కు అవసరమయ్యే పరుగులపైనే దృష్టిసారించాలని కోహ్లీ సూచించాడని చెప్పుకొచ్చాడు.
'గత సీజన్లో విరాట్ కోహ్లీతో మాట్లాడినప్పుడు నాకు అతను విలువైన సలహా ఇచ్చాడు. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే నువ్వు.. ఆరెంజ్ క్యాప్ ఎలా అందుకుంటావ్? అది ఏమాత్రం సాధ్యం కాదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేసి జట్టుకు కావాల్సిన 20-30 పరుగులపై దృష్టి పెట్టమని కోహ్లీ భాయ్ నాకు సూచించాడు. అప్పటి నుంచి ఎన్ని పరుగులు చేస్తున్నాననే విషయాన్ని పట్టించుకోవడమే మానేసా. నేను చేస్తున్న పరుగులు జట్టుకు ఉపయోగపడుతున్నాయా? లేదా అనేదానిపైనే ఫోకస్ పెట్టా. విరాట్ సలహా మానసికంగా నాకు బలాన్నిచ్చింది'అని పరాగ్ చెప్పుకొచ్చాడు. సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం ద్వారా మానసిక బలం మెరుగువుతుందన్నాడు.