న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభానికి ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్కు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా యువ బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్టాండ్బైగా కోహ్లీసేనతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అతను గాయంతో అర్దాంతరంగా వెనక్కిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ల సిరీస్కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్తో జరుగుతున్న మ్యాచ్లో అవేశ్ ఖాన్ గాయపడ్డాడు.
ఈ మ్యాచ్లో కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్ బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్లో అవేశ్ ఖాన్ వేలు విరిగినట్లు తేలింది. అతను కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దాంతో అతని ఇంగ్లండ్ పర్యటన అర్థాంతరంగా ముగిసింది.
ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే స్టెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 సెకండాఫ్ను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి చాలా సమయం ఉన్నా.. ఆలోపు అవేశ్ ఖాన్ కోలుకుంటాడా? అనేది సందేహంగా మారింది. ఎడమ చేతి బొటన వేలు విరగడం.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం ఢిల్లీ క్యాపిటల్స్ను కలవరపెడుతుంది. ఒకవేళ కోలుకున్నా.. అదే స్థాయిలో బౌలింగ్ చేయగలడా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్లో అవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 8 మ్యాచ్ల్లో 7.70 ఎకనామీతో 14 వికెట్లు తీశాడు. ఈ పెర్ఫామెన్స్తోనే టీమిండియా పిలుపును అందుకున్నాడు. కానీ అంతలోనే గాయపడటం.. అతని కెరీర్ను ప్రశ్నార్దకంలో నెట్టింది. వాస్తవానికి ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో అవేశ్ ఖాన్కు చోటు దక్కలేదు. కానీ కౌంటీ ఎలెవన్ టీమ్లో ఆటగాళ్లు తక్కువ అవడంతో అవేశ్ ఖాన్, సుందర్ ఆ జట్టు తరఫున బరిలోకి దిగారు. అసలు అవేశ్ ఖాన్ ఈ పర్యటనకు స్టాండ్ బైగా ఎంపికవ్వకున్నా బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక పర్యటనకు ఎంపికై ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేవాడని చెబుతున్నారు. ఒకవేళ అవేశ్ ఖాన్ దూరమైతే మాత్రం ఢిల్లీకి కష్టాలు తప్పవు.