ప్రథమార్ధంలో ఆకట్టుకున్న మిస్టర్ 360
37 ఏళ్ల ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో ఒకడు. ఆర్సీబీ టైటిల్ కరువును తీర్చాలంటే.. డివిలియర్స్ బ్యాట్ జులిపించాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో జరిగిన ఐపీఎల్ 2021 ప్రథమార్ధంలో డివిలియర్స్ ప్రదర్శన బాగుంది. రెండు మ్యాచుల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.
యూఏఈ పిచ్లపై కూడా ఏబీడీ సందడి చేయాలని ఆర్సీబీ ఫాన్స్ కోరుకుంటుంన్నారు. మిస్టర్ 360 దీనికోసం సన్నాహాలు ప్రారంభించాడు. సెప్టెంబర్ 13న ఏబీ బ్యాటింగ్ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డివిలియర్స్ ఇందులో భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు.
నిత్యనూతనంగా ఉండాలి
తాజాగా తన బ్యాటింగ్ ప్రాక్టీస్ గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2021 తిరిగి ఆరంభం అవ్వడం చాలా బాగుంది. ఐపీఎల్ కోసం చాలా సన్నద్ధమవుతున్నా. ఇక్కడి వికెట్ కఠినంగా ఉంటుంది. బౌలర్లు బాగా బంతులు వేస్తున్నారు. ఇక్కడ చాలా తేమ ఉంది.
మేము చెమటలు కక్కుతున్నాం. ఎందుకంటే తేమ కొంత బరువును తగ్గిస్తుంది. అయితే నాలాంటి వృద్ధులకు వీలైనంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటలో పోటీపడేందుకు నిత్యనూతనంగా ఉండాలి. కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో పోటీపడేందుకు ఎప్పుడూ తాజాగా ఉండాలి. అందుకోసం శ్రమిస్తున్నా' అని అన్నాడు.
ఏం చేశారో తెలుసుకున్నా
'రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది గొప్ప సెషన్. ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరినీ చూడటం ఆనందంగా ఉంది. అందరూ ఆడేందుకు చాలా ఉత్సాహంగా కనిపించారు. నేను రేపటి వార్మప్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఐపీఎల్ మొదటి సగం తర్వాత ఆర్సీబీ సహచరులను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు మా జట్టులో కొంతమంది వచ్చారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది.
అయితే వచ్చిన వారితో మాట్లాడి ఇన్ని రోజులు ఏం చేశారో తెలుసుకున్నా. కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిశాయి. తరువాతి రోజుల్లో చాలా మందిని కలుస్తాను. వారితో కూడా మాట్లాడుతా' అని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు.
ICC Awards: ఫీల్డర్లను పరుగులు పెట్టించింది.. ఐసీసీ ప్రత్యేక అవార్డు గెలుచుకుంది! ఎవరో తెలుసా?!!
ఏడు మ్యాచ్లలో 207 పరుగులు
ఐపీఎల్ 2021 ఆగిపోయేవరకు వరకు ఆర్సీబీ ఏడు మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచులు గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఏబీ డివిలియర్స్ ఈ ఏడు మ్యాచ్లలో 51.75 సగటుతో 207 పరుగులు చేశాడు. ఏబీ రెండు అర్ధ సెంచరీలు కూడా బాదాడు. అత్యధిక పరుగులు చేసినవారిలో ఏబీ 12వ స్థానంలో ఉన్నాడు.
యూఏఈలో డివిలియర్స్ ప్రాక్టీస్ అదిరిపోయింది. బంతిని మైదానం నలువైపులా ఆడుతూ రాబోయే సీజన్లో అదరగొట్టేలా కనిపించాడు. మరి సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్లోని మిగతా మ్యాచ్ల్లో ఏబీ ఎలా ఆడతాడో చూడాలి. ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్తో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 20న ఆర్సీబీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
|
కొత్తవారితో ఒప్పందం
కరోనా భయంతో లీగ్ మధ్యలోనే జట్టును వీడిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో ఆర్సీబీ.. శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హసరంగాను తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో సెకండాఫ్ లీగ్కు దూరమైన డానియల్ సామ్స్ స్థానంలో శ్రీలంకకే చెందిన దుష్మంత చమీరాతో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూజిలాండ్ టీమ్ తరఫున బిజీగా ఉన్న ఫిన్ అలెన్ ప్లేస్లో టిమ్ డేవిడ్, గాయంతో దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశ్ దీప్లు జట్టులోకి వచ్చారు. అయితే భారత్ వేదికగా జరిగిన లీగ్లో చూపించిన జోరును ఆర్సీబీ.. యూఏఈ గడ్డపై కొనసాగిస్తుందో? లేదో? చూడాలి.