మైదానంలోకి దూసుకొచ్చిన బుజ్జి కుక్క
గతవారం ఐర్లాండ్ క్లబ్ క్రికెట్లో భాగంగా మైదానంలో బుజ్జి కుక్క ఫీల్డర్లను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. బ్రీడీ, సీఎస్ఎన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అబ్బీ లెక్కీ.. స్కేర్లెగ్ దిశగా షాట్ ఆడింది. ఫీల్డర్ బంతిని అందుకొని నాన్స్ట్రైక్ ఎండ్వైపు విసిరింది. అదే సమయంలో ఒక బుజ్జి కుక్క తన యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి దూసుకొచ్చింది.
బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. అది కాస్త మిస్ అయింది. రనౌట్ అవకాశం కూడా పోయింది. ఇక బంతిని బుజ్జి కుక్క తన నోట కరుచుకొని గ్రౌండ్లో పరుగులు పెట్టింది. ఫీల్డర్లు కూడా ఆ కుక్క వెంబడి పరుగులు తీశారు. ఈ వీడియో అప్పుడు వైరల్ అయింది.
|
ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్
ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టింది. బుజ్జి కుక్క చేసిన పని స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు అభిమానులను ఆకట్టుకుంది. దాంతో ఐసీసీ ఇప్పుడు ఆ కుక్కనే ప్రత్యేక అవార్డుకు (ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్) ఎంపిక చేసింది. బంతిని నోట కరుచుకుని.. టోపీ పెట్టుకుని ఉన్న కుక్క ఫొటోను ఐసీసీ పోస్టు చేసింది. 'ఈసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో ఒక కొత్త అతిథి వచ్చి చేరింది. బంతిని నోట కరచుకొని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క అది. అందుకే దాన్ని అథ్లెట్ డాగ్ పరిగణిస్తూ.. ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్ అవార్డును బహుకరించాం' అంటూ పోస్ట్ చేసింది.
రూట్కు ఐసీసీ అవార్డు
సొంతగడ్డపై భారత్తో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్లో జో రూట్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సెంచరీలతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 105.81 సగటుతో 528 పరుగులు చేశాడు. దీంతో ఆగస్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో విజేతగా నిలిచాడు. ఇక ఐసీసీ మహిళల ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయర్ టోర్నీలో ఈమియర్ రిచర్డ్సన్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చింది. 4.19 ఎకానమీతో 7 వికెట్లు తీసింది. బ్యాటింగ్లో 76 పరుగులతో సత్తా చాటి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలకుగాను రూట్తో పాటు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది నామినేట్ అయ్యారు.
IPL 2021: టీ20 ప్రపంచకప్లో చోటు.. అయినా ఐపీఎల్లో నెట్ బౌలర్లుగా విండీస్ పేసర్లు! కారణం ఏంటంటే?
ఓటింగ్ ద్వారా విజేత
మూడు ఫార్మాట్లలోని ప్రతీ క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కు సంబంధించిన సభ్యులు ఉంటారు.