
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సరి, బేసి, లీమ్ ఇయర్ సెంటిమెంట్లను సరిచేస్తూ రోహిత్ సేన
ఐదోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. తాజాగా తమ విజయంపై స్పందించిన రోహిత్.. చెప్పినట్లుగా సరిసంఖ్య ఏడాది అయిన 2020లో టైటిల్ గెలిచామని గుర్తు చేశాడు. ఈ ట్వీట్కు ఓ వీడియోను కూడా జత చేశాడు.
అసలు విషయం ఏమిటంటే.. ముంబై గతంలో 2013, 2015, 2017, 2019 బేసి సంఖ్య సంవత్సరాల్లోనే నాలుగుసార్లు టైటిల్ సాధించింది. దీంతో ఆ జట్టు బేసి సంఖ్య సంవత్సరాల్లోనే గెలుస్తుందనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకు సంబంధించిన ఒక యాడ్ కూడా మార్చిలో లాక్డౌన్కు ముందు విడుదలైంది
అందులో నిద్రపోతున్న రోహిత్ శర్మను ఒకతను మేల్కొలిపి ముంబై విజయంపై సరి-బేసి అపోహలను గుర్తుచేస్తాడు. అలాగే హిట్మ్యాన్ జెర్సీ నంబర్ కూడా 45కి 46గా మార్చుకుంటే బాగుంటుందని సూచిస్తాడు. ఆ సలహపై స్పందించిన రోహిత్.. ముంబై విజయానికి బేసి సంఖ్యే అవసరమైతే ఈ ఏడాది కూడా తమకు కలిసి వస్తుందని అంటాడు. ఇది కేవలం ఐపీఎల్ 2020 మాత్రమే కాదని, ఐపీఎల్ 13వ సీజన్ కూడానని ఆ వీడియోలో గుర్తుచేస్తాడు.
ఇక ఈ యాడ్ విడుదలైన కొద్ది రోజులకే కరోనా కారణంగా లాక్డౌన్ విధించగా మార్చి 29న ప్రారంభంకావాల్సిన లీగ్ ఆరు నెలలు వాయిదా పడి చివరికి యూఏఈలో సెప్టెంబర్ 19న ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ముంబై ఐదోసారి విజేతగా నిలవడమే కాకుండా ఆ జట్టు విజయాలపై ఉన్న అపోహలను తొలగించుకుంది. దాంతో రోహిత్ శర్మ ఆ పాత యాడ్ను తన ట్విటర్ వేదికగా పంచుకొని.. ఈసారి తాము విజేతగా గెలిచి చూపించామని చెప్పాడు.