KXIP vs RR: 99 వద్ద ఔటైన గేల్.. ఆర్చర్ జోస్యం మళ్లీ నిజమైంది.. ఫ్యాన్స్ షాక్!!

అబుదాబి: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్తోనే కాదు ట్వీట్ల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్చర్ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్లో ఏది జరిగినా.. ఆర్చర్ ముందే చెప్పాడనే ట్వీట్ మన ముందు నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది మాత్రం ఆర్చర్కే తెలియాలి. నిజంగానే ఆర్చర్ వద్ద టైమ్ మిషీన్ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. తాజాగా అతనికి సంబందించిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
99 వద్ద ఔటైన గేల్:
అబుదాబి వేదికగా శుక్రవారం సాయంత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో స్మిత్ సేన అద్భుత విజయం సాధించింది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. ఈ మ్యాచ్లో సెంచరీ కొడతానని ముందే పంజాబ్ జట్టు సబ్యులకు చెప్పి బరిలోకి దిగిన గేల్.. సెంచరీ ముందు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సిక్స్ బాదిన గేల్.. 99 రన్స్కు చేరుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఆర్చర్ అద్భుతమైన యార్కర్తో గేల్ను బౌల్డ్ చేశాడు. ముందుగా ప్యాడ్లను తాకిన బంతి.. ఆ తర్వాత వికెట్లను గిరాటేసింది.

నేను బౌలింగ్ చేస్తుంటే:
క్రిస్ గేల్ను ఔట్ చేసిన జోఫ్రా ఆర్చర్.. 'ఇప్పటికీ బాస్ క్రిస్ గేల్' అని ఓ ట్వీట్ చేశాడు. కాగా యూనివర్స్ బాస్ను జోఫ్రా ఔట్ చేసిన తర్వాత.. అతడు చేసిన పాత ట్వీట్ను రాజస్థాన్ రాయల్స్ రీట్వీట్ చేసింది. 'నేను బౌలింగ్ చేస్తుంటే.. అతడు సెంచరీ చేయలేడు' అని 2013లో ఆర్చర్ చేసిన ట్వీట్ను రాజస్థాన్ రీట్వీట్ చేసింది. 100 శాతం నిజం అంటూ కాప్షన్ పెట్టింది. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆర్చర్ ట్వీట్పై కొందరు ఫ్యాన్స్ షాక్ అవుతుండగా.. నిజంగానే ఆర్చర్ వద్ద టైమ్ మిషీన్ ఉందా అని మరికొందరు అంటున్నారు.

క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్:
ప్రస్తుత ఐపీఎల్లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆర్చర్ ఒక అద్భుతమైన క్యాచ్ను పట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతిని భారీ షాట్ ఆడిన ఇషాన్ కిషన్.. బౌండరీ లైన్కు కాస్త ముందు ఆర్చర్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్ దాన్ని అందుకున్నాడు. అసాధారణమైన క్యాచ్లను పట్టడం క్రికెట్లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్ దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. 'క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్' అని ఆర్చర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.

పంజాబ్ టైటిల్ గెలుస్తుంది:
ఐపీఎల్ 2020 టైటిల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుస్తుందని జోఫ్రా ఆర్చర్ జోస్యం చెప్పాడు. అయితే ఈ ఇంగ్లండ్ పేసర్ చెప్పింది ఇప్పుడు కాదు.. ఆరేళ్ల క్రితం. పంజాబ్ టైటిల్ గెలుస్తుందని 2014లో ట్వీట్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ గతంలో చాలా ఏళ్ల క్రితం చేసిన ట్వీట్లు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లకు సంబంధం కలిగి ఉండటం గమనార్హం. వరుసగా నాలుగు సిక్సులు, ఒకే ఓవర్లో 30 పరుగులు సహా ఆర్చర్ చేసిన చాలా ట్వీట్లు నిజమయ్యాయి. దీంతో ఆర్చర్కు భవిష్యవాణి తెలుసంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
KXIP vs RR: అదే మా కొంపముంచింది: కేఎల్ రాహుల్