యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం..
‘ఈ సీజన్లో మేం ఇక ముందుకు వెళ్లకపోవచ్చు. ప్రతీసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మా సన్నద్ధతలో ఏదైనా లోపం ఉందేమో చూడాలి. ఎందుకంటే సన్నాహాలను బట్టే ఫలితాలు ఉంటాయి. మన సన్నద్ధత బాగుంటే ఫలితాలు సాధించాలనే ఒత్తిడి దరిచేరదు. లోపాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం. 4-5 మ్యాచ్లు ముగిసిన తర్వాత తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగిపోతుంది. యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో చూడాలి.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
200వ మ్యాచ్.. గెలవలేదు..
ఐపీఎల్లో ధోనీ 200 మ్యాచ్లు పూర్తి చేసుకొని లీగ్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 170 మ్యాచ్లు చెన్నై తరఫున ఆడగా... చెన్నై నిషేధానికి గురైన రెండేళ్లలో పుణే సూపర్ జెయింట్స్ తరఫున మరో 30 మ్యాచ్లు ఆడాడు. లీగ్లో ధోనీ మొత్తం 4,596 పరుగులు సాధించగా... తాజా మ్యాచ్తో ఒక్క సీఎస్కే తరఫునే ధోనీ ఐపీఎల్లో 4 వేల పరుగుల మైలురాయిని (మొత్తం 4,022) కూడా దాటాడు. అయితే ఈ స్పెషల్ మ్యాచ్లో ధోనీకి విజయందక్కపోవడం అతని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఈ సీజన్లోనే అత్యల్ప స్కోర్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, ధోనీ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జోస్ బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయాన్నందించారు. ఈ గెలుపుతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశలపై ఆశలను రెకెత్తించింది.
బేసిక్స్ మరిచిన ధోనీ
ఈ మ్యాచ్లో పరుగు తీయడమే కష్టంగా మారినట్లు, బౌండరీ బాదడం అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టాలేమో అన్నంత భారంగా చెన్నై బ్యాటింగ్ చేసింది. దాదాపు టెస్ట్ మ్యాచ్ను తలపించింది. అయితే 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో ధోనీ, జడేజా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భారీ షాట్లు ఆడకున్నా క్విక్ సింగిల్స్, డబుల్స్తో జట్టు స్కోర్ను 100 ధాటించారు. అయితే ఇక్కడే ధోనీ పొరపాటు చేసి రనౌటయ్యాడు. కార్తీక్ త్యాగి వేసిన బౌలింగ్లో లాంగాన్ దిశగా షాట్ ఆడిన ధోనీ.. బంతిని ఆపే క్రమంలో ఆర్చర్ తడబడటంతో రెండో పరుగు తీశాడు. అయితే చాకచక్యంగా ఆర్చర్ బంతిని విసిరేయడంతో రనౌటయ్యాడు. ఇక ఫీల్డర్ తడబడినప్పుడు రెండో రన్ తీయవద్దనే బెసిక్ రూల్ను ధోనీ మరిచాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.