మా కోర్ గ్రూప్ మార్చాలి..
‘ఇది మాకు చాలా కఠినమైన సీజన్. మేం చాలా తప్పిదాలు చేశాం. కానీ గత నాలుగు మ్యాచ్ల్లో జోరు కనబర్చాం. మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. ఎందుకంటే 7-8 మ్యాచ్ల్లో వెనుకబడ్డ తర్వాత పుంజుకోవడం చాలా కష్టం. ఆ పరిస్థితుల్లో ఆటను కూడా ఆస్వాదించలేం. డ్రెస్సింగ్ రూమ్లో కూడా ప్రశాంతత ఉండదు. వేలంపై బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే మా తదుపరి సీజన్ ప్రణాళిక ఆధారపడి ఉది. మా కోర్ గ్రూప్ను మార్చాల్సి ఉంది. మరో 10 ఏళ్లకు కావాల్సిన ఆటగాళ్లను సిద్దం చేయాలి. ఐపీఎల్ ప్రారంభంలో మేం సిద్దం చేసిన జట్టు 10 ఏళ్లు సేవలందించింది. జట్టును తర్వాతి తరానికి అప్పగించే సమయం ఆసన్నమైంది.
14 పాయింట్లు ఉంటే..
ఈ గెలుపుతో మేం బలంగా పుంజుకున్నామనే సందేశాన్ని మా అభిమానులకు ఇచ్చాం. మేం పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో ఉన్నాం. కానీ 14 పాయింట్లు మా చేతిలో ఉంటే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేవాళ్లం. ఈ ఒక్క సీజన్లో ప్లే ఆఫ్స్పై అనిశ్చితి నెలకొంది. ఇక జెర్సీలు ఇవ్వడంతో నేను ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నానని అనుకున్నారు. అలాంటిదేం లేదు. ఇక రుతురాజ్ బ్యాటింగ్ చూసినప్పుడు నెట్స్లో బాగా ఆడేవాడు. కానీ గేమ్లో మాత్రం విఫలమయ్యేవాడు. అలాగే అతను కోవిడ్ బారిన పడ్డాడు. కోలుకున్న తర్వాత కూడా ఫిట్గా లేడు. అందుకే అతన్ని కాదని ఫాఫ్, వాట్సన్తో బరిలోకి దిగాం. అది పనిచేయలేదు. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరైనా అనుభవం గల ఆటగాళ్లతోనే వెళ్తారు'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
రుతురాజ్ రికార్డు ఫిఫ్టీ..
రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. చెన్నై హ్యాట్రిక్ విజయాన్నందుకుంది. దాంతో రుతురాజ్ చెన్నై తరఫున హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 రన్స్ చేసింది. దీపక్ హుడా (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 62 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48) రాణించారు. పంజాబ్ బౌలర్లలో జోర్డాన్కు ఒక వికెట్ దక్కింది.