ఎక్కడైనా ఆడుతా:
రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసిన ఓ వీడియోలో జోస్ బట్లర్ మాట్లాడుతూ... 'ఓపెనింగ్తో పోలిస్తే మిడిలార్డర్లో ఆడటం భిన్నంగానే అనిపిస్తుంది. ఓపెనింగ్ కంటే.. మిడిలార్డర్లో ఎక్కువగా స్పందించాలి. బాధ్యత పెరుగుతుంది. మ్యాచులో ముందు జరిగిన దాన్ని సరిచేయాలి. అయితే జట్టు అవసరాల మేరకు ఏ పాత్ర పోషించేందుకైనా నేను సిద్ధమే. సవాళ్లను నేను ఎప్పుడూ స్వీకరించడానికి సిద్దమే' అని అన్నాడు.
చెన్నై నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాం:
'చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మాకో మంచి భాగస్వామ్యం అవసరం. రన్ రేటుతో అసలు సమస్యే లేదు. ఎందుకంటే మేం భారీ లక్ష్యాన్ని ఛేదించడం లేదు. వికెట్లు పడినప్పటికీ మేం మంచి భాగస్వామ్యం నెలకొల్పాలనుకున్నాం. ప్రశాంతంగా ఆడాం. జోరు అందుకోగానే ఆటను చెన్నై నుంచి లాగేసుకున్నాం. అయితే మేమింకా ఫీల్డింగ్ను మెరుగుపర్చుకోవాలి. ఎందుకంటే.. ఫేలవమైన ఫీల్డింగ్తో 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. చెన్నైపై గెలుపు మాకెంతో అవసరం. స్టీవ్ స్మిత్ మంచి భాగస్వామ్యం అందించాడు. ఇక జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా బాగా బౌలింగ్ చేశారు' అని జోస్ బట్లర్ చెప్పాడు.
అవార్డుతో పాటు:
మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుతో పాటు తన క్రికెట్ హీరో ఎంఎస్ ధోనీ నుంచి జోస్ బట్లర్ ఊహించని బహుమతి అందుకున్నాడు. ఐపీఎల్లో ధోనీ ఆడిన 200 మ్యాచ్ జెర్సీని అతడు గిఫ్ట్గా స్వీకరించాడు. అతిపెద్ద అభిమానుల్లో ఒకడైన బట్లర్కు 200 ఐపీఎల్ మ్యాచ్లో ధరించిన ప్రత్యేక జెర్సీని ధోనీ బహుమతిగా ఇచ్చాడు. ఆ జెర్సీతో మురిసిపోతున్న బట్లర్ ఫొటోను రాజస్థాన్ యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేసింది. ధోనీ అంటే తనకెంతో అభిమానం అని ఇంగ్లిష్ హిట్టర్ పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆఫ్స్ అవకాశాలు మెరుగు:
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో బట్లర్ (70) రాణించాడు. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పది మ్యాచ్లాడి నాలుగో విజయం సాధించిన రాజస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
KXIP vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. పంత్ వచ్చేశాడు!!