
దుబాయ్: ఐపీఎల్ 2020లో మంగళవారం రసవత్తర పోరు జరగనుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో శ్రేయస్ మూడు మార్పులు చేశాడు. గాయాల నుంచి కోలుకున్న రిషబ్ పంత్, షిమ్రన్ హెట్మైర్, డేనియల్ శామ్స్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. క్రిస్ జోర్డాన్ స్థానంలో జేమ్స్ నీషమ్ ఆడనున్నాడు.
ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. పంజాబ్ ప్లేఆఫ్ బెర్తు కోసం పోరాడుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే పంజాబ్ ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. రాహుల్, మయాంక్ శుభారంభం అందిస్తుండగా.. ఇటీవలే జట్టులోకి వచ్చిన గేల్ స్థాయికి తగ్గప్రదర్శన చేస్తున్నాడు. ఆల్రౌండర్ మాక్స్వెల్ పేలవ ఫామ్ జట్టును దెబ్బతీస్తోంది. డెత్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయాల్సి ఉంది. పంజాబ్ కన్నా ఢిల్లీ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ముఖ్యంగా స్పీడ్స్టర్ నోర్జ్, రబాడను ఎదుర్కోవడం ఆ జట్టుకు సవాలే.
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్లు జరగ్గా 14-11తో పంజాబ్ ఆధిక్యంలో ఉంది. చివరి నాలుగు మ్యాచ్లో మాత్రం చెరో రెండు సార్లు గెలిచాయి. గత సీజన్లో కూడా చెరొక విజయాన్నందుకున్నాయి. ఇదే మైదానం వేదికగా ఇరు జట్లు మధ్య జరిగిన గత మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. ముంబైతో జరిగిన గత మ్యాచ్కు కూడా ఇదే మైదానం వేదికైంది. ఇక ఈ మైదానంలో ఐదు మ్యాచ్లు ఆడిన పంజాబ్ మూడు గెలిచింది. ఇక నాలుగు మ్యాచ్లు ఢిల్లీ నాలుగు గెలిచింది. ఇక్కడ ముందు బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ గెలిచాయి.
తుది జట్లు
ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, షిమ్రన్ హెట్మైయిర్, డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్పాండే, కగిసొ రబాడ.
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హూడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్.