ఫైనల్ సెంటిమెంట్
ఐపీఎల్ ఫైనల్లో ఆడే టీమ్లో రోహిత్ శర్మ ఉంటే.. ఆ జట్టు టైటిల్ గెలుపొందడం సెంటిమెంట్గా కొనసాగుతోంది. కావాలంటే రికార్డులు పరిశీలిద్దాం!!. ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ కప్పుపై మరోసారి కన్నేసింది. 2009, 2013, 2015, 2017, 2019లో ఫైనల్కి చేరిన ముంబై.. 2009లో మినహా అన్ని ఫైనల్లోనూ గెలుపొందింది. చివరిగా ఆడిన నాలుగు ఫైనల్లోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై కప్పు సాదించింది. 2009లో జట్టులో రోహిత్ లేడు.. అప్పుడు కప్ మిస్ అయింది. మరోవైపు కెప్టెన్గా కూడా అన్ని ఫైనల్లో తమ జట్టుకు విజయాలు అందించాడు. ఈరోజు ఆ రికార్డును రోహిత్ కాపాడుకుంటాడో లేదో చూడాలి.
టైటిల్ కొట్టిన దక్కన్ ఛార్జర్స్
2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ ఛార్జర్స్ టైటిల్ కొట్టిన విషయం తెలిసిందే. అప్పుడు దక్కన్ ఛార్జర్స్ టీమ్లో రోహిత్ శర్మ ఉన్నాడు. 2010లో ఫైనల్లో ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్లో రోహిత్ శర్మ లేడు. ఆ ఏడాది సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై బరిలోకి దిగి.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత దక్కన్ ఛార్జర్స్ నుంచి ముంబై టీమ్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. కెప్టెన్గా ఆ జట్టుకి నాలుగు టైటిల్స్ని అందించాడు. ఈరోజు కూడా రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై ఆడనుంది కాబట్టి.. రోహిత్ సెంటిమెంట్ ముంబైకి కలిసిరానుంది.
అత్యధిక టైటిల్స్
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది. ముంబై ఖాతాలో నాలుగు టైటిల్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మూడు, కోల్కతా నైట్రైడర్స్ రెండు టైటిల్స్ గెలిచాయి. ఇక సన్రైజర్స్ హైదరాబాద్, దక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్ విజేతగా నిలిచాయి. ఇప్పటికే అత్యధిక టైటిల్స్ గెలిచిన కెప్టెన్గా రికార్డుల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ఈరోజు మ్యాచ్లో ముంబైని గెలిపిస్తే.. ఆ రికార్డ్ మరింత మెరుగవనుంది.
దంచుడే వాళ్లకి తెలిసింది
ముంబై లీగ్ దశలో 14 మ్యాచ్లలో 9 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్లో సునాయాసంగా ఢిల్లీని 57 పరుగులతో చిత్తు చేసి ఫైనల్కు చేరింది. జట్టులో ప్రతీ ఒక్కరు తమదైన పాత్ర పోషించారు. ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ల బ్యాటింగ్ ముంబైకి బలం. ఇక కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు ఎలాంటి ప్రత్యర్థి అయినా.. దంచుడే వాళ్లకి తెలిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనా.. ముంబైకు ఆ లోటు ఏమాత్రం కనిపించలేదు. ప్రతీ మ్యాచ్లో కనీసం ఇద్దరు బ్యాట్స్మెన్ చెలరేగి ప్రత్యర్థులను దెబ్బ కొట్టారు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే జస్ప్రీత్ బుమ్రా.. ప్రత్యర్థులకు సింహ స్వప్నం. ట్రెంట్ బౌల్ట్ వికెట్లతో దెబ్బకొడుతున్నాడు. స్పిన్నర్లు కూడా రాణిస్తుండడంతో ఆ జట్టుకు ఎలాంటి సమస్యలు లేవు.
పెద్దన్న లాంటివారు.. కోచ్ మృతి పట్ల వీవీఎస్ లక్ష్మణ్ భావోద్వేగం!!