
దుబాయ్: ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకున్న ఆ జట్టు పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని కూడా పదిలం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 9 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్లో అదరగొట్టిన ఈ డిఫెండింగ్ చాంపియన్.. అనంతరం బ్యాటింగ్లో చెలరేగి అద్భుత విజయాన్నందుకుంది. అయితే తొడ కండరాల గాయంతో గత మూడు మ్యాచ్లుగా బెంచ్కే పరిమితమైన ఆ జట్టు సారథి రోహిత్ శర్మ.. తన స్థానంలో ఓపెనర్గా చెలరేగుతున్నఇషాన్ కిషన్ విన్నింగ్ షాట్కు స్టన్ అయ్యాడు.
111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి అలవోక విజయాన్నందించాడు. 153.19 స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అన్రిచ్ నోర్జ్ వేసిన 15వ ఓవర్లో హై ఓవర్ డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. చాలా బ్యూటిఫుల్గా ఆడిన ఈ షాట్కు డకౌట్లోని రోహిత్ శర్మతో పాటు అందరూ ముగ్దులయ్యారు. జహీర్ ఖాన్, రాబిన్ సింగ్ల పక్కన కూర్చున్న రోహిత్.. ఇషాన్ విన్నింగ్ షాట్కు ఫిదా అయ్యాడు. 'వావ్ వాటే షాట్'అనే ఎక్సెప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 రన్స్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25), రిషభ్ పంత్ (21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/17), ట్రెంట్ బౌల్ట్ (3/21) ఢిల్లీ పతనాన్ని శాసించారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 111 పరుగులు చేసి సునాయంగా గెలుపొందింది. ఇషాన్కు తోడుగా డికాక్(26), సూర్యకుమార్ యాదవ్ (12 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్కు ఒక వికెట్ దక్కింది. ఈ దారుణ ఓటమితో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తదుపరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.