ముంబై: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే జట్లన్నిటినీ దుబాయ్కు తరలించి క్వారంటైన్లో ఉంచింది. కోవిడ్-19 నిబంధనలను కూడా కఠినంగా అమలు చేస్తుంది. ప్రస్తుతం అన్ని జట్ల ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఇప్పటికైతే ఒకరి గదిలోకి మరొకరు వెళ్లరాదు. బయోబబుల్ వాతావరణంలో ఉంటున్నా ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
అయితే బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ హేమంగ్ అమిన్ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో ఆటగాళ్ల కోసం బీసీసీఐ పలు సూచనలు చేసింది. టీమ్ రూమ్, జిమ్, ప్రైవేట్ బీచ్, తమ గది తలుపుల దగ్గర ఆటగాళ్లు కలిసేందుకు అనుమతి ఉంది. అయితే అలాంటి సమయంలోనూ కచ్చితంగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. ఇందుకోసం క్రికెటర్లు ప్రత్యేక బ్లూటూత్ పరికరాన్ని చేతికి ధరించాల్సి ఉంటుంది. రిస్ట్ బ్యాండ్లా ఉండే ఈ పరికరం ఎవరైనా భౌతిక దూరం నిబంధన ఉల్లంఘిస్తే శబ్దంతో అలర్ట్ చేస్తుంది. నిద్ర సమయంలోనే దీన్ని తొలగించాలి. మిగతా అన్నివేళల్లో ధరించాలని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు వస్తే వారు కూడా దీన్ని ధరించాల్సిందే. టీమ్ బస్సుల్లోనూ జిగ్జాగ్ పద్దతిలో క్రికెటర్లు కూర్చోవాలని చెప్పింది. టీవీ క్రూ మొత్తం పీపీఈ కిట్లు ధరించాలని కూడా స్పష్టం చేసింది.
అయితే ఆటగాళ్లు ఒకరి గదులు ఇంకొకరు వెళ్లకూడవద్దనేది కష్టమని రాజస్థాన్ రాయల్స్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ అభిప్రాయపడ్డాడు. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమై.. ఇప్పుడు కూడా గదిల్లో ఉండటం ఇబ్బందిగా ఉందన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేమని వాపోయాడు. ఇక లీగ్ 53 రోజుల పాటు జరుగుతుండటంతో ఆటగాళ్లకు హెయిర్ కట్కు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇది ముందే ఊహించిన ముంబై ఇండియన్స్ ఏకంగా ఓ హెయిర్ స్టైలిస్ట్నే తమతో దుబాయ్కు తీసుకెళ్లింది. ఇతర ఫ్రాంచైజీలు కొన్ని దుబాయ్లో స్థానిక హెయిర్ స్టైలిస్ట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
లీసా స్టాలేకర్ క్రికెట్ జర్నీ.. పుణె అనాథాశ్రమం నుంచి ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్' దాకా.!