దూకుడు లేని బ్యాటింగ్..
టాస్ గెలిచిన ధోనీ పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యాడు. నెమ్మదైన వికెట్పై ముందుగా బ్యాటింగ్ తీసుకొని తప్పిదం చేశాడు. ఇక చెన్నై కూడా వేగంగా వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ ఆ జట్టు రన్రేట్ 6ను దాటలేకపోయింది. 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నైను.. జడేజా (30 బంతుల్లో 35 నాటౌట్), ధోనీ (28 బంతుల్లో 28) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 51 పరుగులు జోడించినప్పటికీ.. వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది. ఏ దశలోనూ ధాటిగా ఆడాలనే తపన వారిలో కనిపించలేదు. చివర్లో దూకుడుగా ఆడి ఉంటే.. 150 పరుగులైనా చేసి ఉండేది. అప్పుడు గెలవడానికి అవకాశాలు ఉండేవి.
సామ్కరన్తో బౌలింగ్ చేయించకపోవడం..
125 పరుగులను కాపాడుకునే క్రమంలో చెన్నై ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ను ఒత్తిడిలోకి నెట్టింది. దీపక్ చాహర్, హజల్వుడ్ అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. కానీ స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్లను ఔట్ చేయడంలో చెన్నై బౌలర్లు విఫలమయ్యారు. అప్పటి వరకూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన పిచ్ మీద బట్లర్ సౌకర్యవంతంగా ఆడటం ఆశ్చర్యపరిచింది. ఇద్దరు కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ కుదురుకుంటున్న వేళ.. ఎడమ చేతవాటం పేసర్ అయిన సామ్ కరన్తో బౌలింగ్ చేయించి ఉంటే బాగుండేది. కానీ ఈ మ్యాచ్లో కరన్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. లక్ష్యం తక్కువ కాబట్టి.. బౌలింగ్లో వేగంగా మార్పులు చేయాల్సింది. కానీ ధోనీ అలా చేయలేదు.
ఓటమి నేర్పని పాఠం..
ధోనీ ఆడే మైండ్ గేమ్ ఎవరికీ అంతుపట్టదు. అనూహ్యమైన ఎత్తుగడలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో మహీ తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పటికే చెన్నై ఆరు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ.. ధోనీ మాత్రం కొత్తగా ఏం ప్రయత్నించలేదు. గత మ్యాచ్ల్లో ఎలాగైతే ఆడారో.. ఈ మ్యాచ్లోనూ అదేలా ఆడారు. తమ తప్పిదాలను సవరించుకునే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేక ప్రణాళికలతోనూ బరిలోకి దిగలేదు. గెలవాలనే తపనే చెన్నై ఆటగాళ్లలో కనిపించకపోవడం అందరిని విస్మయపరుస్తోంది. చెన్నై ప్లేఆఫ్స్కు చేరినా చేరకపోయినా.. తదుపరి మ్యాచ్ల్లో మాత్రం విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చెన్నైకి చేతకాలేదు..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, ధోనీ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జోస్ బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయాన్నందించారు. ఈ గెలుపుతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశలపై ఆశలను రెకెత్తించింది.