ఆండ్రీ రస్సెల్ ఒంటరి పోరాటం
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాను ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డకౌట్గా పెవిలియన్కు చేర్చాడు. అటు తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప(11), కెప్టెన్ దినేశ్ కార్తీక్(19)లు కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో హిట్టర్ ఆండ్రీ రసెల్ 44 బంతుల్లో 50 నాటౌట్ (5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కేకేఆర్
వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొమ్మిది పరుగులకే పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్కతాను చెన్నై బౌలర్ల దెబ్బకు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. అయితే, ఆండ్రీ రస్సెల్ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు.
రసెల్పై దినేశ్ కార్తిక్ ప్రశంసలు
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆండ్రీ రసెల్పై దినేశ్ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు. కార్తీక్ మాట్లాడుతూ "టీ20 గేమ్ను అంచనా వేయడం కష్టం. ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తామో ముందే ఊహించడం కష్టం. మరో 20 పరుగులు చేసి ఉంటే ఫలితంగా మరోలా ఉండేది. పవర్ ప్లేలో నాలుగు వికెట్లను కోల్పోతే, మనం ఎనిమిది బంతులు వెనుకబడినట్లే" అని అన్నాడు.
క్రెడిట్ అంతా రస్సెల్దే
"ఈ మ్యాచ్లో రస్సెల్కు క్రెడిట్ ఇవ్వాలి. అన్నింటి కంటే ముఖ్యంగా తన బాదుడు తత్వాన్ని నియంత్రించుకుంటూ నిదానంగా ఆడటం ఆశ్చర్యానికి గురిచేసింది. తక్కువ మొత్తాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాం. వెట్ పిచ్పై స్పిన్నర్లు చూపించిన తెగువ నిజంగా అద్భుతం" అని దినేశ్ కార్తీక్ చెప్పాడు. కాగా, కేకేఆర్ తన తర్వాతి మూడు మ్యాచుల్ని సొంత గడ్డపై ఆడనుంది.