
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్గా రవిచంద్రన్ అశ్విన్ను ఎంపిక చేశారు. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 11వ సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్గా అశ్విన్ని నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం సోమవారం అధికారిక ప్రకటన చేసింది.
ఐపీఎల్ పదో సీజన్లో పంజాబ్ కెప్టెన్గా గ్లెన్ మ్యాక్స్వెల్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. 11వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో మ్యాక్స్వెల్ను ఢిల్లీ డేర్డెవిల్స్ కొనుగోలు చేసింది. దీంతో జట్టుకు ఎవర్ని కెప్టెన్గా ఎంపిక చేయాలనే దానిపై పలు తర్జన భర్జనల తర్వాత అశ్విన్ను కెప్టెన్గా ఎంపిక చేసింది.
ఇప్పటి వరకు ఐపీఎల్లో ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహారించని అశ్విన్.. తొలిసారి సారథ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. పంజాబ్ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ సలహా మేరకు అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తమ ఫేస్బుక్ పేజీ ద్వారా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం ప్రకటించింది.
దీనిపై అశ్విన్ మాట్లాడుతూ 'తనను కెప్టెన్గా ఎంపిక చేసి కొత్త బాధ్యతల్ని అప్పచెప్పడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇదొక ఛాలెంజ్ తీసుకుని జట్టును ముందుకు తీసుకెళతా' అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అశ్విన్ను రూ. 7.60 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే పదేళ్ల ఐపీఎల్ సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు యువరాజ్ సింగ్, కుమార సంగక్కర, ఆడమ్ గిల్క్రిస్ట్, జార్జి బెయిలీ, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్స్వెల్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే తొలిసారి కెప్టెన్గా ఎంపికైన అశ్విన్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.