హైదరాబాద్: పదేళ్ల ఐపీఎల్ సంబరం ముగిసింది. వచ్చే ఏడాది జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలంపాట జరగనుంది. దీంతో ఐపీఎల్ 2018లో ఏయే ఆటగాళ్లు ఏయే ప్రాంఛైజీ తరుపున బరిలోకి దిగుతారోనని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్లు సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్కు సంబంధించిన ఒకరు వెల్లడించారు. '2016లో హైదరాబాద్ జట్టు ట్రోఫీ అందుకోవడంలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారు. 2017లోని ఐపీఎల్ జట్టు నుంచి వార్నర్, భువీ, ధావన్ను తమ వద్దే ఉంచుకోవాలి' అని ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి పదేళ్ల ఒప్పందం ముగియడంతో వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్లు అందరూ వేలంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకునే విధంగా అవకాశం కల్పించాలని నిర్వాహకులను ఐపీఎల్ ప్రాంఛైజీలు కోరారు.
ఇందుకు గాను ఐపీఎల్ నిర్వాహకులు ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, మరో ఇద్దర్ని రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి పొందేలా వెసులుబాటుని కల్పించింది. ఈ క్రమంలో జనవరి 4 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్ల పేర్లను అందజేయాలని ఐపీఎల్ పాలక మండలి ఫ్రాంఛైజీలకు సూచించింది.
దీంతో ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకోవాలని, మిగిలిన వారిని వేలానికి వదిలేయానికి నిర్ణయించాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ధోని, రైనాను, ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యాను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు ఇంతకముందు వార్తలు వచ్చాయి.
తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ను అట్టిపెట్టుకోవాలని భావించినట్లు సమాచారం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.