హైదరాబాద్: ఎంతో ఆశతో ఐపీఎల్ క్రికెట్ ను ప్రత్యక్షంగా చూద్దామని వచ్చిన అభిమానులకు నిరేశ ఎదురైంది. టిక్కెట్లు కొని స్టేడియం లోపలికి ప్రవేశించబోతున్న ఇద్దరు క్రికెట్ అభిమానులను భద్రతా సిబ్బంది ఆపేసిన ఘటన పంజాబ్లోని మొహాలీ వేదికగా జరిగిన స్టేడియం వద్ద చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మొహాలీ వేదికగా ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - చెన్నై సూపర్కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ చూసేందుకు పంజాబ్లోని ఓ ప్రాంతానికి చెందిన ఇద్దరు టిక్కెట్లు కొనుకున్నారు. ఆదివారం సాయంత్రం స్టేడియం వద్దకు వచ్చారు. మరికొద్దిసేపట్లో మైదానంలోకి వెళ్లి మ్యాచ్ చూస్తాం అనే సంతోషాన్ని భద్రతా సిబ్బంది ఆవిరి చేశారు. టిక్కెట్లు ఉన్నా వారిని భద్రతా సిబ్బంది లోపలికి పంపించలేదు. కారణం అడిగితే ఇప్పటికే స్టేడియం నిండిపోయింది, లోపలికి వెళ్లడం కుదరదు అని చెప్పారట.
దీంతో వారు లోపలికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయం గురించి వేరే మార్గం అనుసరిస్తుండగా వద్దంటూ వారించారు. అలా చాలాసేపటి వరకు స్టేడియం బయటే కూర్చుండిపోయిన వారిని ఎట్టకేలకు చివరికి రాత్రి 8గంటలకు గేట్ నంబర్ 11 ద్వారా వారిని లోపలకి పంపారు.
దీనిపై స్టేడియం నిర్వాహకులను వివరణ అడగ్గా.. 'ఆదివారం జరిగిన మ్యాచ్కు టిక్కెట్లు కొన్నవారు సుమారు 60 నుంచి 70 మంది మైదానం లోపలికి రాలేకపోయారు. స్టేడియం నిండిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటాం' అని తెలిపారు. ఈ మ్యాచ్లో తీవ్రంగా శ్రమించిన ధోనీ సేన కేవలం నాలుగు పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 197/7 పరుగులు చేయగా ఛేదనలో విఫలమైన ధోనీ జట్టు 193/5 పరుగులు మాత్రమే చేయగలిగింది.