హైదరాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే అభిమానుల్లో క్రేజ్ అంతాఇంతా కాదు. దానికి తోడు చెన్నైవాసులు అతనికి గుండెల్లో గుడి కట్టేస్తున్నారు. భారత జట్టు ఏ కెప్టెన్కి సాధ్యం కాని విధంగా రెండు ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత కేవలం ధోనీకి మాత్రమే దక్కింది. ఈ క్రమంలోనే అతను దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే అభిమానులను సంపాదించుకున్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో ఐపీఎల్కు రెండేళ్లపాటు దూరమైన చెన్నై మళ్లీ ఈ ఏడాదే పునరాగమనం చేసింది. అయితే ఈ ఏడాది పునరాగమనం చేసిన చెన్నైకి అభిమానులు తొలి మ్యాచ్లోనే బ్రహ్మరథం పట్టారు. కానీ చెన్నైలో కావేరి నదీ జలాల వివాదంతో సీఎస్కే సొంతగడ్డపై ఆడే మ్యాచ్లన్నింటినీ పుణెకు తరలించారు. ఈ క్రమంలో పుణె వేదికగా సీఎస్కే శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో తలపడింది.
At the end of the day this boy is the winner. He for @msdhoni darshan without any wait time. #NoJaragandi @ChennaiIPL @CSKFansOfficial #WhistlePodu pic.twitter.com/eNCjfwDaD8
— Anush (@R_Anush) April 20, 2018
చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వన్డౌన్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా ఔట్ అయిన అనంతరం ధోనీ బ్యాటింగ్కు వెళ్తున్నాడు. ఆ క్రమంలో సీఎస్కే అభిమాని అక్కడి సిబ్బందిని సైతం నెట్టుకొని వచ్చి మరీ ధోనీ పాదాలపై పడ్డాడు. అంతటితో ఆగకుండా ఉద్వేగంతో ధోనీని హత్తుకొని ఆనందంతో పొంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ ఘటనపై మిగతా అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.
మైదానంలో భద్రతా సిబ్బందిని దాటుకొని మరీ ఓ అభిమాని ధోనీ పాదాలకు మొక్కడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఓ మ్యాచ్లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఇటీవల ధోనీ ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలోనూ ఇలాంటి సన్నివేశమే పునరావృతమైంది. బహుమతి తీసుకోవడానికి వచ్చిన ఓ యువ ఆటగాడు వేదికపై ఒక్కసారిగా ధోనీ కాళ్లకు మొక్కాడు. ధోనీ అతన్ని బలవంతంగా పైకి లేపి బహుమతి ప్రదానం చేశాడు. అనంతరం వేదిక దిగకుండా ధోనీ కాళ్లకు మరోసారి మొక్కుతూ అతను కనిపించాడు. ఇంతలో వేదికపై ఉన్న వారు ఆ యువకుడిని కిందకు వెళ్లమంటూ పంపంచేశారు.