పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) వెన్నుపోటు పొడించేందుకు సిద్దమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సమయంలో తమకు అండగా నిలిచిన పీసీబీకి బంగ్లాదేశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2026) టోర్నీకి తమ ఆటగాళ్లను దూరంగా ఉంచాలనే యోచనలో బీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి పీఎస్ఎల్ 2026 సీజన్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్కు చెందిన ముస్తాఫిజుర్ రెహ్మాన్, పర్వేజ్ హోస్సైన్, షోరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా, తంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హోస్సైన్కు బీసీబీ ఎన్ఓసీలు మంజూరు చేసింది.
కానీ పాకిస్థాన్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ ఆటగాళ్లను పంపేందుకు సంకోచిస్తోంది. ఈ పరిణామంపై బంగ్లాదేశ్ క్రీడా శాఖ మంత్రి అమినూల్ హక్ స్పందించారు. 'మా ఆటగాళ్ల భద్రత విషయంలో చిన్నపాటి సందేహం ఉన్నా.. వారిని పాకిస్థాన్కు పంపబోము. దీనిపై ముందుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పూర్తి విశ్లేషణ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత జాతీయ భద్రతా సంస్థల సలహా మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది’అని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఇంధన కొరత, భద్రతా కారణాలతో పీఎస్ఎల్ 2025 సీజన్ను ప్రేక్షకుల్లేకుండా రెండు మైదానాల్లోనే నిర్వహిస్తామని పీసీబీ ప్రకటించింది.లీగ్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో విదేశీ ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. చాలా మంది ఆటగాళ్లు పీఎస్ఎల్ ఆడేందుకు సంకోచిస్తున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ కోరగా.. ఐసీసీ పట్టించుకోలేదు. దాంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. బంగ్లాదేశ్కు అండగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తామని ప్రకటించింది. ఐసీసీ చర్చలతో వెనక్కి తగ్గిన పీసీబీ.. మెగా టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే డిమాండ్ను పెట్టింది.
బంగ్లాదేశ్కు అండగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇప్పుడు ఆ దేశ క్రికెట్ బోర్డు మొండి చెయ్యి చూపించేందుకు సిద్దమైంది. దాంతో పీసీబీపై పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దేశం కోసం పాకిస్థాన్.. ఐసీసీ, బీసీసీఐతో గొడవకు దిగిందా? అని మండిపడుతున్నారు.