రేసులో విశాఖపట్నం ముందంజ
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ముందంజలో ఉంది. రేసులో ఉన్న మిగతా మూడు నగరాలు త్రివేండ్రం, పుణె, రాజ్కోట్. చెన్నై ఫ్రాంచైజీ దృష్టిలో మొదటి పేరు మాత్రం విశాఖపట్నంగానే ఉంది. ప్రేక్షకుల మద్దతు, రవాణా, హోటల్ సదుపాయాలు అందుకు కారణంగా తెలుస్తోంది. ధోనీకి సైతం విశాఖపట్నం అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడ అతడికి అద్భుతమైన రికార్డులున్నాయి. పిచ్పై పూర్తి అవగాహన ఉంది. దాంతో పాటు అభిమానుల మద్దతు సైతం ఎక్కువగానే ఉంటుంది. మరి విశాఖ నగరానికి ఈ అవకాశం దక్కుతుందేమో చూడాలి.
ఐపీఎల్ మ్యాచ్లను చెన్నై నుంచి తరలించాలనుకుంటున్నాం
'మేం ఐపీఎల్ మ్యాచ్లను చెన్నై నుంచి తరలించాలనుకుంటున్నాం. నాలుగు ప్రత్యామ్నాయ నగరాల పేర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. అవి విశాఖపట్నం, త్రివేండ్రం, పుణె, రాజ్కోట్. చెన్నైలో భద్రత గురించి ఆలోచిస్తున్నాం. పరిస్థితులను అర్థం చేసుకొని తుది నిర్ణయం తీసుకోవాల్సింది మీరే అని చెన్నైకి చెప్పేశాం' అని రాయ్ పేర్కొన్నారు. మంగళవారం కోల్కతా-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు గందగోళ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
కావేరీ బోర్డుతో చెన్నై మ్యాచ్లకు లింకుపెట్టి పెట్టారు
మ్యాచ్ను కావేరీ బోర్డుతో లింకుపెట్టి మ్యాచ్ను జరగనివ్వమని ఇప్పటికే స్పష్టం చేసిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు, సంఘాల నాయకులు మైదానంలోకి వెళ్తున్న క్రికెట్ అభిమానులపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. దీంతో 400 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మ్యాచ్ నిర్వహణకు వ్యతిరేకంగా కొంతమంది నిరసనకారులు నలుపు రంగు బెలూన్లను కూడా గాల్లోకి విడుదల చేశారు. చెపాక్ స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై వారు బూట్లు విసిరి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.
జడేజాపైకి బూట్లు విసిరిన ఆందోళనకారులు
లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా లక్ష్యంగా బూట్లు విసరగా, అవి గురి తప్పి బౌండరీ లైన్ వద్ద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఎంగిడి ఉన్నారు. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రవీంద్ర జడేజాపై బూట్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్లను చెన్నైలో నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
చెన్నై మ్యాచ్లను విశాఖపట్నంలో నిర్వహిస్తాం
చెన్నై మ్యాచ్లను విశాఖపట్నంలో నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర క్రికెట్ సంఘం తెలిపింది. కొన్ని ఐపీఎల్ మ్యాచ్లనైనా వైజాగ్లో నిర్వహించాలని నెలన్నర క్రితమే ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాను కోరానని ఆంధ్ర క్రికెట్ సంఘం జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ తెలిపారు. ‘నెలన్నర క్రితం రాజీవ్ శుక్లాతో మాట్లాడినప్పుడు కావేరీ వివాదం లేదు. తాజాగా చెన్నై నుంచి వేదిక మారుస్తున్నారని తెలిసి ఆయనకు ఫోన్ చేశాను. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. త్వరలోనే ఆయనతో మాట్లాడతా'ననే ఆశాభావాన్ని అరుణ్ వ్యక్తం చేశారు. ఒకవేళ మాకు అవకాశం ఇస్తే.. వారంలోనే వైజాగ్ పిచ్ను సిద్ధం చేస్తామని అరుణ్ తెలిపారు.
చెన్నై v రాజస్థాన్ మ్యాచ్ టికెట్ల నిలిపివేత
మరోవైపు టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ఏప్రిల్ 20న తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్కు సంబంధించి గురువారం ప్రారంభించాల్సిన టికెట్ల విక్రయ ప్రక్రియను వాయిదా వేశారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తమిళనాడు క్రికెట్ సంఘం వెల్లడించింది.