టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను డ్రెస్సింగ్ రూమ్లో మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే ప్లేయర్ అంటూ పేర్కొన్నాడు. ఇంత అంకితభావంతో కష్టపడి పనిచేసే వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని ద్రావిడ్ స్పష్టం చేశాడు. చాలామంది సెంచరీలు చేస్తేనే గొప్పగా చూస్తారు. కానీ మ్యాచ్ విజయం సాధించడానికి సహకారం అందించే ఇన్నింగ్స్ ఆడడమే తన ప్రకారం గొప్ప అని ద్రావిడ్ పేర్కొన్నాడు. ఇకపోతే జులై 1న ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమయ్యే రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ కీలకపాత్ర పోషించే వీలుంది. ఇక లీసెస్టర్షైర్తో జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్.. కాస్త టచ్లో ఉన్నట్లు కన్పిస్తున్నాడు.
ద్రావిడ్ మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లీ నేను చూసిన అత్యంత కష్టపడి పనిచేసే వ్యక్తి. అతను ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడిన తీరు బాగుంది. అన్ని సరైన షాట్లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒక దశను దాటుతున్నాడు. అతనికి మోటివేషన్ అవసరమని నేను అనుకోను. క్రికెటర్ల కెరీర్లో ఇలాంటి ఓ దశను ప్రస్తుతం కోహ్లీ ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడూ సెంచరీల మీద దృష్టి పెట్టడం సరి కాదు. చాలా మంది సెంచరీ చేస్తే అతను సక్సెస్ అయినట్లు చూస్తారు. కానీ మాకు మాత్రం కోహ్లీ నుండి సెంచరీలకు బదులు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కావాలి. అతను డ్రెస్సింగ్ రూమ్లో చాలా మందికి స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తిస్తాడు' అని ద్రావిడ్ తెలిపాడు.
ఇక ఇంగ్లాండ్లో గతేడాది పర్యటించినప్పుడు.. కోహ్లీ భారత జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో భారత్ ఓడిపోయిన తర్వాత అతను కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం రీషెడ్యూల్ చేయబోయే టెస్టులో అతను ఓ ప్లేయర్గా కన్పించబోతున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో చాలా కాలంగా కోహ్లీ నుంచి సెంచరీ రాలేదు. దీంతో ఈ టెస్ట్లో కోహ్లీ సెంచరీ చేస్తే చూడాలని అతని అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఇక మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ జట్టును ఓడించిన తర్వాత ఇంగ్లాండ్ విజయోత్సాహంతో ఉంది. ఇంగ్లాండ్ మీద సిరీస్ గెలవాలంటే భారత్ మ్యాచ్ను గెలవాలి లేదా డ్రా చేసుకోవాల్సి ఉండగా.. సిరీస్ను సమం చేసుకోవడానికి ఇంగ్లాండ్ తప్పకుండా గెలవాలి.