భారత ప్రభుత్వం అనుమతి:
ఐపీఎల్ 2020 సీజన్కి తాము ఆతిథ్యమిస్తామని రెండు నెలల క్రితమే ఈసీబీ ఓ ప్రతిపాదనని బీసీసీఐకి పంపింది. కానీ సెప్టెంబరు నాటికి భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఆశించిన బీసీసీఐ.. ఆ సమయంలో మౌనంగా ఉండిపోయింది. అయితే దేశంలో ఇప్పటికీ పరిస్థితుల్లో అదుపులోకి రాకపోగా.. మరింతగా చేయి దాటిపోయాయి. దాంతో భారత్లో ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని భావించిన బీసీసీఐ.. తాజాగా ఈసీబీ ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది. తమకు బీసీసీఐ నుంచి మెయిల్ ద్వారా ఒక లేఖ వచ్చిందని ఈసీబీ కూడా పేర్కొంది. ఇక భారత ప్రభుత్వం అనుమతి రావడంతో.. యూఏఈలోనే ఐపీఎల్ జరగడం ఖాయం అయింది.
సెప్టెంబరు 19 నుంచి:
కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడడంతో.. ఐపీఎల్ 13 నిర్వహణకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్ తయారు చేసింది. వైరస్ నేపథ్యంలో బయో-సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ని నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. నెల రోజుల ముందే టీమ్స్ని అక్కడికి పంపించి.. 14 రోజులు క్వారంటైన్లో ఉంచుతారు. మొత్తంగా 51 రోజుల విండోలో 60 మ్యాచ్లు జరగనున్నాయి.
ఐపీఎల్ షెడ్యూల్పై ఆరోజే నిర్ణయం:
ఐపీఎల్ 13వ సీజన్కు సంబంధించి ఆగస్టు 1న పాలకమండలి సమావేశం కానుంది. ఆ రోజు టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. టోర్నీని ఎలా నిర్వహించాలి, ఆటగాళ్ల సాధన, వసతి సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై లోతుగా చర్చించనున్నారు. మరోవైపు వైరస్ నేపథ్యంలో అక్కడికి చేరుకునే వారు క్వారెంటైన్లో ఉండడానికి తగిన ఏర్పాట్లపైనా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా హాజరుకానున్నారు.
2014లో యూఏఈలో ఐపీఎల్:
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే బీసీసీఐ భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్ల్ని నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఆ అనుభవంతోనే ఈసీబీకి మరో అవకాశం బీసీసీఐ ఇచ్చింది. ఒకవేళ ఐపీఎల్ నిర్వహించకపోతే వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి రావడంతో ఈ లీగ్ను ఎలాగైనా జరపాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది.