న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ పేరు తలచుకోకుండా పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లకు పూట గడవదని మండిపడుతున్నారు. అవకాశం దొరికితే చాలు టీమిండియాను తక్కువ చేసి మాట్లాడేందుకు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు ప్రయత్నిస్తుంటారు. తాజాగా రమీజ్ రాజా సైతం ఆ తరహా వ్యాఖ్యలే చేయడం భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే అనేకసార్లు ఐపీఎల్ గురించి అవాకులు చవాకులు పేల్చిన రమీజ్ రాజా.. మరోసారి టీమిండియాను తక్కువ చేసేలా నోరుపారేసుకున్నాడు. ఎలాంటి సంబంధం లేకపోయినా తమ జట్టు గొప్పతనం గురించి పొగుడుకోవడానికి రమీజ్ రజా చేసిన భారత జట్టును వాడుకున్నాడు.
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు తొలి టెస్ట్లో విజయాన్నందుకుంది. 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. కెప్టెన్ బాబర్ అజామ్ (118, 55)తో పాటు అబ్దుల్లా షఫీఖ్ (160*) కీలక పాత్ర పోషించాడు. అబ్దుల్లా ఆఖరి వరకు క్రీజ్లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు.
'ఇప్పటి వరకు పాక్ టెస్టు చరిత్రలో లంకపై గెలుపు అత్యుత్తమం. భారీ లక్ష్య ఛేదనలో బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ గెలిచారు. ప్రస్తుతం గాలెలో పాక్ విజయం.. మేము బెంగళూరు వేదికగా భారత్పై గెలిచిన మ్యాచ్తో సమానం'అని పేర్కొన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్తోపాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడుతున్నారని రమీజ్ రజా పేర్కొన్నాడు.
1987లో టర్నింగ్ పిచ్ అయిన బెంగళూరు వేదికగా 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 204 రన్స్కే ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ను ఉద్దేశించి రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో రమీజ్పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సందర్భం లేకుండా భారత్ను ప్రస్తావిస్తూ గొప్పలు చెప్పుకోవడాన్ని తప్పుబడుతున్నారు.