హైదరాబాద్: స్వదేశంలో తీరిక లేకుండా బిజీ క్రికెట్ ఆడుతున్న కోహ్లీసేన త్వరలో పుట్బాల్ ప్లేయర్లుగా మైదానంలో సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటులతో భారత జట్టు క్రికెటర్లు ఆడే ఈ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగనుంది.
విరాట్ కోహ్లీ ఆల్ హార్ట్స్ ఎఫ్సీ జట్టుకి కెప్టెన్గా ఉండగా, ఆల్ స్టార్స్ ఎఫ్సీ జట్టుకు రణ్బీర్ కపూర్ నేతృత్వం వహించనున్నారు. ఇంతకీ ఈ మ్యాచ్ ఎందుకోసం ఆడుతున్నారంటే విరాళాల సేకరణ కోసం. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ కోసం కోహ్లీ సేన ఆడుతుండగా, అభిషేక్ బచ్చన్ కోసం బాలీవుడ్ జట్టు బరిలోకి దిగుతోంది.

ఈ పుట్బాల్ మ్యాచ్ కోసం ధోని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు. అంతేకాదు మా కోసం ఇప్పటి నుంచే ధోని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని పేర్కొన్నాడు. ఎందుకంటే పెద్ద మైదానాల్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదని కోహ్లీ చెప్పాడు.
ఇదిలా ఉంటే గత ఏడాది జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు రెండు గోల్స్ సాధించడంతో డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్ చెరో గోల్ కొట్టారు.