హైదరాబాద్: ఆసీస్ పర్యటనకు రానున్న టీమిండియాకు కష్టాలు తప్పవని అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు ఎలాంటి పరాభవం ఎదురైందో... ఆసీస్ పర్యటనలో కూడా అదే తరహా అనుభవం ఎదురవుతుందని పాంటింగ్ జోస్యం చెప్పాడు.
పేస్ బౌలింగ్కు అత్యంత అనుకూలమైన ఆసీస్ పిచ్లపై టీమిండియా బ్యాట్స్మెన్ కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొవాల్సి వస్తుందని పాంటింగ్ ఈ సందర్భంగా తెలిపాడు. క్రికెట్.కామ్.ఏయు వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో పాంటింగ్ మాట్లాడుతూ "ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ దారుణంగా వైఫల్యం చెందింది" అని అన్నాడు.
"ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ప్రతీసారి టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంది. ప్రధానంగా బంతి స్వింగ్ అయ్యే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు తడబాటుకు లోనవుతుంటారు. పేస్ బౌలింగ్లో బంతి తన దిశను గాలిలోనే మార్చుకుంటే భారత ఆటగాళ్లు సునాయాసంగా వికెట్లు సమర్పించుకుంటారు. ఇంగ్లండ్లో అదే చూశాం.. ఆసీస్లో కూడా అదే రిపీట్ అవుతుంది" అని పాంటింగ్ తెలిపాడు.
"ఉపఖండపు పిచ్ల్లో తొలి రోజు నుంచే స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మేము చాలాసార్లు ఇబ్బంది పడ్డాం. ఇక ఆసీస్ పిచ్లు మా పేస్ ఎటాక్కు పూర్తి అనుకూలంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో ఆస్ట్రేలియాలో టీమిండియాకు అసలు సిసలు సవాల్ ఎదురుకానుంది" అని పాంటింగ్ పేర్కొన్నాడు.
స్వదేశంలో వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత నవంబర్లో భారత క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు టీ20 సిరీస్తో పాటు నాలుగు టెస్టుల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.