న్యూ ఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో వెస్టిండీస్ జట్టు ఆతిథ్య టీమిండియాతో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ -బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్ జట్ల మధ్య జరిగిన రెండు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్తో రెండు టెస్ట్ల సిరీస్ కోసం సన్నాహకంగా జరిగిన వామప్ మ్యాచ్లో బోర్డు జట్టుకు విండీస్ దీటుగా బదులిచ్చింది.
ఆదివారం బ్యాటింగ్కు దిగిన విండీస్.. సునీల్ అంబ్రిస్(98 బంతుల్లో 114 నాటౌట్, 17ఫోర్లు, 5సిక్స్లు) అజేయ సెంచరీకి తోడు కార్లోస్ బ్రాత్వైట్(52), డౌరిచ్(65) అర్ధసెంచరీలతో 89 ఓవర్లలో 366/7 ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్లు బ్రాత్వైట్ (52), కీరన్ పావెల్ (44) పరుగులతో శుభారంభం అందించారు. అంతగా అనుభవం లేని బోర్డు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సహచరుల బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఈ ఇద్దరు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన హెట్మైర్(7), రోస్టన్ చేజ్(5) అంతగా ఆకట్టుకోలేకపోగా, షేన్ డౌరిచ్(65), అంబ్రిస్ ఇన్నింగ్స్ గతినే మార్చేశారు. బోర్డు బౌలర్లను దనుమాడుతూ అంబ్రిస్..పవర్ హిట్టింగ్ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో తన ఇన్నింగ్స్లో 17ఫోర్లు, 5 సిక్స్లతో కదంతొక్కాడు.
యువ పేసర్ అవేశ్ఖాన్(4/60) నాలుగు వికెట్లతో రాణించగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరవ్ కుమార్ (2/126) రెండు వికెట్లు తీశాడు. కేరళ స్పీడ్స్టర్ బాసిల్ థంపీ తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
సంక్షిప్త స్కోర్లు: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 360/6 డిక్లేర్డ్, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 366/7 డిక్లేర్డ్(అంబ్రిస్ 114 నాటౌట్, డౌరిచ్ 65, బ్రాత్వైట్ 52, అవేశ్ఖాన్ 4/60, సౌరవ్ కుమార్ 2/126)