ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్కు అప్పగించాలని టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కృష్ణమాచారి శ్రీకాంత్.. హార్దిక్ పాండ్యాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశాడు. తాజాగా అశ్విన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం హాట్టాపిక్గా మారింది.
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సీజన్లోనే రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను తమ కొత్త కెప్టెన్గా ముంబై ఫ్రాంచైజీ ప్రకటించింది. జట్టు భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వివరణ ఇచ్చింది.
ఆ తర్వాత ముంబై ఇండియన్స్కే చెందిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియాను విజేతగా కూడా నిలబెట్టాడు. దాంతోనే హార్దిక్ను తప్పించి ముంబై కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. రెండు టీ20 ప్రపంచకప్లు అందించిన రోహిత్, సూర్య.. హార్దిక్ సారథ్యంలో ఆడటం బాలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఈ విషయంపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. 'హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్కు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అప్పగించాలి. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. కానీ ఇప్పటికీ తీసుకోలేదు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అతని సారథ్యంలో టీమిండియా పొట్టి ప్రపంచకప్ 2026ను కైవసం చేసుకుంది. కాబట్టి ముంబై ఇండియన్స్.. సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి.
అయితే హార్దిక్ పాండ్యా నాయకత్వ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా తొలి సీజన్లోనే టైటిల్, రెండో సీజన్లో రన్నరప్గా జట్టును నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యాది. కానీ ముంబైకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
అభిమానులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో తొలి సీజన్ హార్దిక్ పాండ్యా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ ఉండగా.. ఐపీఎల్లో తానే కెప్టెన్గా కొనసాగం అతడికి మానసికంగా సవాలే. అయినప్పటికీ సరైన మద్దతు, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలిగితే పాండ్యా మంచి కెప్టెన్ అని నిరూపించుకునే అవకాశం ఉంది. ఈ సీజన్లో అతను మెరుగైన ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 29న కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది.