వరుస విజయాలకు బ్రేక్
వైఎస్ఆర్ స్టేడియం ప్రారంభమైన తర్వాత వరుసగా నాలుగు వన్డేలలో విజయం సాధించి జోరుమీద ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ ద్వారానే ఎదురుదెబ్బ తగిలింది. 2013లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ను విండీస్ రెండు వికెట్ల తేడాతో ఓడించింది. స్టేడియంలో భారత్ ఓడిన తొలి మ్యాచ్ అదే. బుధవారం జరగనున్న మ్యాచ్లో భారత్ జోరుకు అనుభవలేమితో సతమతమవుతున్న విండీస్ బృందం అడ్డుకట్ట వేయడం కష్టమే.
రికార్డులు బద్దలు కొట్టి.. సచిన్, వార్నర్ల సరసన రోహిత్
ఆ మ్యాచ్లోనూ అదే మందకొడి బ్యాటింగ్
2013 నవంబర్ 24న జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ వెస్టిండీస్ కోరిక మేరకు బ్యాటింగ్కు దిగింది. తొలి పది ఓవర్ల పవర్ప్లేలో 48 పరుగులే చేసింది. వంద పరుగులకు చేరే సమయానికి ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. వందో బంతి ఆడుతున్న కోహ్లీ.. రామ్పాల్ బౌలింగ్లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో 99 పరుగుల వద్ద సెంచరీని కోల్పోయాడు. యువరాజ్ 28 పరుగులే చేయగా, ధోనీ 40 బంతుల్లో 51పరుగులతో అజేయంగా నిలిచి కెరీర్లో ఏభయ్యో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.
41వ ఓవర్లో భారత్కు చుక్కలు
బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి 2 వికెట్లను 23 పరుగులకే కోల్పోయినా తొలి పవర్ ప్లేలో 60 పరుగులు రాబట్టేసింది. పావెల్ 59 పరుగులు చేశాడు. సిమ్మన్స్(62)తో కలిసిన కెప్టెన్ బ్రావో (50) మిడిలార్డర్ను చక్కదిద్దాడు. ఈ దశలో ఏడో ఆటగానిగా 41వ ఓవర్లో బ్యాటింగ్కు దిగిన సామీ భారత్కు చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో 19 పరుగులు చేస్తే గెలుపొందే స్థితికి జట్టును చేర్చాడు. అతడు అజేయంగా 63 పరుగులతో నిలవడమే కాక.. విండీస్కు 2 వికెట్ల ఆధిక్యంతో చిరస్మరణీయ విజయం దక్కేలా చేశాడు.
విండీస్కు అది వండర్ఫుల్ విజయం
2005లో వైఎస్సార్ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి విశాఖలో గెలుపు జోరు మీద ఉన్న భారత జట్టుకు ఎనిమిదేళ్ల తర్వాత గానీ బ్రేక్ పడలేదు. వరుసగా నాలుగు వన్డేల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీమిండియాకు బ్రేక్ పడింది. వెస్టిండీస్ ద్వారా తగిలిన షాక్ చేదు అనుభవంగా మిగిలిపోయింది. మరి బుధవారం జరగనున్న మ్యాచ్లో ఫలితాలెలా వస్తాయనేది వేచి చూడాల్సిందే!!