పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని త్వరగా ఔట్ చేయాల్సింది. కానీ అది కుదరలేదు. ఇక ఫీల్డింగ్ తప్పిదాలతో కూడా మూల్యం చెల్లించుకున్నాం అని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. చివరి రెండు వన్డేలను భారత్ గెలిచింది.
ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు.. జట్టులోనే కొనసాగుతున్నా: గేల్
మ్యాచ్ అనంతరం జాసన్ హోల్డర్ మాట్లాడుతూ... 'మా బ్యాట్స్మెన్ తమ పనిని సజావుగా పూర్తిచేశారు. మ్యాచ్ మా చేతుల్లోనే ఉందని భావించాం. కానీ.. కోహ్లీ అద్భుతంగా ఆడి మ్యాచ్ లాగేసుకున్నాడు. అతన్ని త్వరగా ఔట్ చేయాల్సింది. అలా జరగలేదు. మరోవైపు ఫీల్డింగ్ తప్పిదాలతో కూడా భారీ మూల్యం చెల్లించుకున్నాం. గత కొంతకాలంగా మా జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. మా ఆటపై అందరం కూర్చొని చర్చించాలి. ఆటను మెరుగుపర్చుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంది. టెస్ట్ ఆటగాళ్లు బాగా రాణించాల్సిన అవసరం ఉంది' అని హోల్డర్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'శ్రేయాస్ అయ్యర్ బాగా ఆడాడు. అతనికి ఆట అసాధారణం. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో అయ్యర్ ఎంతో సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. నాపై ఉన్న ఒత్తిడిని కూడా తగ్గించేశాడు. గేమ్ మావైపుకి రావడానికి అయ్యర్ చాలా కష్టపడ్డాడు. అందరూ వేర్వేరు బ్యాటింగ్ స్థానాల్లో బాధ్యత వహించాలని కోరుకుంటున్నా. ఎక్కడ అవకాశం వచ్చినా ఆటగాళ్లు ఆడేలా సిద్ధంగా ఉండాలి. నేను గత కొన్ని మ్యాచులను సవాలుగా తీసుకున్నా. గెలిచేందుకే పోరాడుతా. మొదటి 10 ఓవర్లలో వారు బాగా ఆడటంతో వర్షం వచ్చిన సమయంలో మేము కొంచెం భయపడ్డాము. మా బౌలర్లు బాగా రాణించారు' అని తెలిపాడు.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన భారత క్రికెటర్లు (వీడియో)
ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రిస్ గేల్(72; 41బంతుల్లో 8×4, 5×6), లూయిస్(43; 29బంతుల్లో 5×4, 3×6) ఇన్నింగ్స్ మొదటిలో మెరుపులు మెరిపించారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. 32.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ జయకేతనం ఎగురవేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (114; 99 బంతుల్లో 14×4) మరో సెంచరీ చేసాడు. శ్రేయాస్ అయ్యర్ (65: 41 బంతుల్లో 3x4, 5x6) మరోసారి మెరిశాడు.