
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాంకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రితో పాటు కేదార్ జాదవ్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ శుభాకాంక్షలు చెప్పారు.
దీనికి సంబందించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరుగుతున్న సమయంలోనే బీసీసీఐ ఈ వీడియోను పోస్ట్ చేసింది. 'అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, జై హింద్' అని రాసుకొచ్చింది. 'మన దేశ చరిత్రలో ఇది అత్యంత ప్రత్యేకమైన రోజు' అని కోహ్లీ పేర్కొన్నాడు. అందరూ భారత ప్రజలకు శుభాకాంక్షలు అని తెలపగా.. కేదార్ జాదవ్ మరాఠి భాషలో తెలిపాడు.
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రిస్ గేల్(72; 41బంతుల్లో 8×4, 5×6), లూయిస్(43; 29బంతుల్లో 5×4, 3×6) ఇన్నింగ్స్ మొదటిలో మెరుపులు మెరిపించారు.
అనంతరం డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. 32.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ జయకేతనం ఎగురవేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (114; 99 బంతుల్లో 14×4) మరో సెంచరీ చేసాడు. శ్రేయాస్ అయ్యర్ (65: 41 బంతుల్లో 3x4, 5x6) మరోసారి మెరిశాడు. తాజా విజయంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా చివరి రెండు వన్డేలను భారత్ గెలిచింది.