హైదరాబాద్: కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇది తొలి విదేశీ పర్యటన కావడంతో ఒత్తిడి అనేది ఉంటుందని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను మరో టెస్టు మిగులుండగానే కోహ్లీసేన 0-2తో చేజార్చుకున్న నేపథ్యంలో భజ్జీ మద్దతుగా నిలిచాడు.
'ప్రతి ఒక్కరు మెరుగవ్వాలనే కోరుకుంటారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు మద్దతుగా నిలవండి. ఆశించిన మేరకు వారు రాణించలేదు. తర్వాతి పర్యటనలో విజయం సాధించవచ్చు. ఇదంతా నేర్చుకోవడంలో ఒక భాగం. టీమిండియా పుంజుకుంటుందని ఆశిస్తున్నా. జట్టు సభ్యులంతా వారికి వారే ఆత్మస్థైర్యం కల్పించుకోవాలి' అని భజ్జీ అన్నాడు.
కెప్టెన్సీలో ధోనితో కోహ్లీని పొల్చడంపై కూడా భజ్జీ స్పందించాడు. 'కోహ్లీ, ధోనీని పోల్చవద్దు. వారు వేర్వేరు తరాల్లో ఆడారు. ప్రతి తరంలోనూ గెలవాలనే సంకల్పంతోనే జట్టు విదేశాల్లో పర్యటిస్తుంది. ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీని మాజీ క్రికెటర్లు అయిన రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లతో అసలు పోల్చకండి' అని భజ్జీ పేర్కొన్నాడు.
'కెప్టెన్సీ అనేక బాధ్యతలు, సవాళ్లత కూడి ఉంటుంది. ఇప్పటివరకు కోహ్లీ బాగానే ఆకట్టుకున్నాడు. అతడికిదే అసలైన తొలి విదేశీ పర్యటన. శ్రీలంక పర్యటనను సవాల్తో కూడిందని చెప్పలేను. ఐసీసీ అవార్డులు అందుకున్న కోహ్లీ అత్యుత్తమంగా ఎదిగినందుకు చాలా సంతోషిస్తున్నా' అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
2017 సంవత్సరానికి విరాట్ కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్లో కోహ్లీ అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడని, టాప్లో కోహ్లీ ఉండటం చాలా సంతషంగా ఉందని భజ్జీ చెప్పాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా కేప్టౌన్, సెంచూరియన్లో 300 లోపు లక్ష్యాలను ఛేదించలేక టీమిండియా సిరిస్ను చేజార్చుకుంది.
ముఖ్యంగా సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫామ్లో ఉన్న భువనేశ్వర్ను తొలగించడం, తొలి రెండు టెస్టుల్లో రహానేను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో జట్టు ఎంపిక సరిలేదంటూ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కోహ్లీసేనకు అందరూ మద్దతుగా నిలవాలని భజ్జీ తన మద్దతుని తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.