
హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య శనివారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ ఉత్కంఠ రేపింది. భారత్ విజయానికి చివరి వరకు సందిగ్ధత నెలకొంది. 173 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయానికి చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయాల్సి వచ్చింది.
దీంతో.. భారత్ జట్టుకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తుండగా.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ 18 పరుగులు సమర్పించుకుని మ్యాచ్ని ఉత్కంఠగా మార్చేశాడు. దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్మెన్ జాంకర్ ఆ ఓవర్లో ఒక సిక్స్, మూడు ఫోర్లు బాదేయడంతో సమీకరణాలు 12 బంతుల్లో 35 పరుగులుగా మారిపోయాయి.
ఈ దశలో 19వ ఓవర్ కోసం డెత్ఓవర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా చేతికి టీ 20 కెప్టెన్ రోహిత్ శర్మ బంతినివ్వగా.. అతని బౌలింగ్లోనూ జాంకర్ ఒక సిక్స్ బాదాడు. బెహార్డీన్ ఒక ఫోర్ కొట్టేశాడు. దీంతో ఆ ఓవర్లోనూ దక్షిణాఫ్రికా 16 పరుగులు పిండుకుంది.
సఫారీలకు టార్గెట్ మరీ చిన్నదైపోయింది. సమీకరణం 6 బంతుల్లో 16 పరుగులుగా మారిపోయింది. అయితే.. చివరి ఓవర్ బౌలింగ్కి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సగం ఓవర్ వరకూ కాస్తా ఒత్తిడిలో కనిపించినా.. 11 పరుగులు మాత్రమే ఇచ్చి చివరి బంతికి జాంకర్ని ఔట్ చేయడంతో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది.
అంతకముందు ఓపెనర్ శిఖర్ ధావన్ 40 బంతుల్లో (47), సురేశ్ రైనా 27 బంతుల్లో (43) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయింది. సఫారీలకు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది.