|
ఎల్లలు దాటిన అభిమానం..హిట్ మ్యాన్ కోసం..
జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన రెండవ టీట్వంటీ మ్యాచ్లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని అభిమానం ఎల్లలు దాటింది. ఏకంగా పోలీస్ సెక్యూరిటీని, ఆ తర్వాత ప్రహరీని దాటుకుని నేరుగా మైదానంలోకి అడుగుపెట్టేశాడు. అడుగు పెట్టిన వాడు కామ్గా లేడు. హంగామా సృష్టించాడు. తన ఆరాధ్య క్రికెటర్ టీమిండియా ట్వంటీ ట్వంటీ కెప్టెన్ రోహిత్ శర్మ వైపు పరుగులు తీశాడు. రోహిత్ శర్మ ముందు ఎల్లకిలా పడుకుని రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే తనకు రోహిత్ శర్మ పాదాలు అందలేదు.
రోహిత్ శర్మకు పాదాభివందనం
హఠాత్తుగా అభిమాని రావడంతో కంగుతిన్న రోహిత్ శర్మ తన పాదాలు తాకొద్దంటూ చెప్పే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపించింది. ఇక గ్రౌండ్లోకి అడుగుపెట్టిన అభిమాని తనను తరుముకొస్తున్న పోలీసులను చూసి లగెత్తాడు. ఈ హంగామా అంతా మ్యాచ్ను చూసేందుకు వచ్చిన మరో వ్యక్తి తన ఫోన్లో బంధించాడు. భారత్ ఫీల్డింగ్ చేస్తున సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో కొంత సేపు ఆటకు ఆటంకం కలిగింది. అయితే రోహిత్ శర్మ కోసం ఓ అభిమాని గ్రౌండ్లోకి దూసుకు రావడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో హిట్ మ్యాన్ కోసం అతనితో కరచాలనం చేసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డ సందర్భాలున్నాయి. అయితే క్రికెట్ అంటే యమ క్రేజ్ ఉన్న భారత్లో క్రికెటర్లు కూడా ఇలాంటి సంఘటనలకు అలవాటు పడిపోయారు.
|
కొందరికి ఫ్యాన్స్... రోహిత్కు భక్తులు
ఇక ఈ తతంగం అంతా ఓ అభిమాని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రోహిత్ శర్మ నిజంగానే అంతటి క్రేజ్ను సంపాదించుకున్నాడంటూ కొందరు కామెంట్ చేస్తే మరికొందరు మాత్రం రోహిత్కు పాదాభివందనం చేయడంలో ఎలాంటి తప్పులేదని చెప్పుకొచ్చారు. ఇంకొందరైతే ఇతర క్రికెటర్లకు అభిమానులు ఉండొచ్చు కానీ రోహిత్ శర్మకు మాత్రం భక్తులు ఉన్నారంటూ కామెంట్ రాసుకొచ్చారు.
మొత్తానికి ఈ ఘటన రాంచీ స్టేడియంలో టాక్ ఆఫ్ ది స్టేడియంగా నిలవగా... వీడియో నెట్టింట్లో వైరల్ కాగానే టాక్ ఆఫ్ ది కంట్రీగా నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ పై భారత్ రెండో విజయం సాధించి ఏకంగా టీట్వంటీ టైటిల్ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 154 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా మరో 16 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయం సాధించింది.