కోహ్లీకి విశ్రాంతి..పంత్కు చాన్స్!
టీమిండియా మాత్రం అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా మనోళ్లు రాణిస్తున్నారు. దాంతో మరొకసారి టీమిండియాదే పైచేయి సాధించే అవకాశం ఉంది. అయితే వరల్డ్కప్ నేపథ్యంలో గత మ్యాచ్లాగే బెంచ్కు మరోసారి చాన్స్ ఉండనుంది. అయితే రిషబ్ పంత్కు అవకాశం ఇస్తారా ? లేదా ? అనేది ఆసక్తిని పెంచుతుంది.
ఇక ఈ మ్యాచ్లో కోహ్లి విశ్రాంతి తీసుకుంటే రోహిత్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. అలాగే నిర్విరామంగా ఆడుతూ..అదరగొడుతున్నరాహుల్కు విశ్రాంతి ఇవ్వచ్చు. ఇదే జరిగితే పంత్తో పాటు సంజూ శాంసన్కు అవకాశం దక్కుతుంది. అప్పుడు రోహిత్-శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. అయ్యర్ వన్ డౌన్లో రావొచ్చు.
శివమ్ దూబే రాణించాల్సిందే..
సంజూ శాంసన్, శివమ్ దూబే రాణించాలని టీమ్మేనేజ్మెంట్ కోరుకుంటుంది. వన్డే సిరీస్ నేపథ్యంలో జడేజాతో పాటు కుల్దీప్ మరోసారి బెంచ్కే పరిమితం కావొచ్చు. చహల్, సుందర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. బే ఓవల్ పిచ్ పేస్ కోటా కావడంతో ఠాకుర్, సైనీ కొనసాగనుండగా.. బుమ్రాకు రెస్ట్ ఇచ్చి మహ్మద్ షమీని తీసుకోవచ్చు.
చెత్త రికార్డును తప్పించుకుంటారా?
న్యూజిలాండ్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్ను గెలిస్తే కోహ్లి సేన కొత్త రికార్డును లిఖిస్తుంది. న్యూజిలాండ్లో ఐదు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లీ సేన నిలుస్తుంది. అదే సమయంలో కివీస్ ఒక చెత్త రికార్డును లిఖించుకుంటుంది. రేపటి మ్యాచ్లో కివీస్కు ఓటమి తప్పకపోతే మాత్రం సొంత గడ్డపై తొలిసారి వైట్వాష్ అయిన చెత్త గణాంకాలను మూటగట్టుకుంటుంది.స్వదేశంలో మూడు, అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన ద్వైపాక్షిక టీ20 సిరీస్ల్లో న్యూజిలాండ్ ఇప్పటివరకూ వైట్వాష్ కాలేదు.
విలియమ్సన్ డౌటే
జట్టుగా న్యూజిలాండ్ బలంగానే కనిపిస్తున్నా మ్యాచ్లు గెలవలేకపోతుంది. ప్రస్తుత తరుణంలో ఆత్మవిశ్వాసం పెంచుకోకపోతే వైట్ వాష్ తప్పదు. నాల్గో టీ20లో దూరమైన కేన్ విలియమ్సన్ నేటి మ్యాచ్ బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.భుజం గాయం కారణంగా మ్యాచ్కు దూరమైన విలియమ్సన్.. ఫిట్నెస్ సాధించినప్పటికీ వన్డే సిరీస్ నేపథ్యంలో అతన్ని ఈ మ్యాచ్కు దూరంగా ఉంచే అవకాశం ఉంది.
ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు టేలర్ బ్యాటింగ్పై జట్టు ఆధారపడుతోంది. నాల్గో టీ20లో సీఫెర్ట్ ఆకట్టుకోవడంతో కివీస్ బ్యాటింగ్ బలం పుంజుకున్నట్లే ఉంది. దీనిలో భాగంగా చివరి టీ20కి పూర్తి స్థాయిలో బరిలో దిగడానికి ప్రణాళికలు రచిస్తోంది. కాగా, బౌలింగ్ విభాగం ఎప్పటిలాగే కాస్త బలహీనంగా కనిపిస్తోంది. సౌతీ అనుభవం పెద్దగా అక్కరకు రాలేదు. వరుసగా రెండు సూపర్ ఓవర్లు వేసినా ఒక్కదాంట్లో కూడా టీమిండియాను కట్టడి చేయలేకపోయాడు.
పరుగుల మోత..
బే ఓవల్ పిచ్ బ్యాటింగ్కు స్వర్గదామం. భారీ స్కోర్లు. నమోదయ్యే అవకాశం ఉంది. ఎదురు గాలి వల్ల పేసర్లకు కొంత ఇబ్బంది ఉంటుంది. వికెట్ నుంచి బౌన్స్ రాబట్టవచ్చు. ఈ మైదానంలో ఐదు మ్యాచ్లు జరగ్గా అన్నింటిల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది.
స్టేడియం కలిసొచ్చేనా?
ఈ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి టీ20. కాగా, గతేడాది జనవరి 28వ తేదీన ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ స్టేడియంలో న్యూజిలాండ్కు విశేషమైన రికార్డు ఉంది.ఇప్పటివరకూ ఇక్కడ కివీస్ ఆరు మ్యాచ్లు ఆడగా నాలుగు మ్యాచ్ల్లో గెలుపొంది, ఒక మ్యాచ్లో మాత్రమే ఓటమి పాలైంది. మరొక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక్కడ కివీస్ చేసిన అత్యధిక స్కోరు 243. ఈ స్టేడియంలో కొలిన్ మున్రోకు ఘనమైన రికార్డు ఉంది. మున్రో కెరీర్లో మూడు టీ20 సెంచరీలు సాధిస్తే అందులో రెండు ఇక్కడ సాధించినవే. 2018లో ఇక్కడ న్యూజిలాండ్ చివరిసారి ఆడిన టీ20 మ్యాచ్లో ఓటమి పాలైంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కివీస్ పరాజయం చవిచూసింది.
తుది జట్లు(అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్)/రోహిత్, రాహుల్/శాంసన్, రిషభ్ పంత్, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, బుమ్రా, సైనీ.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, రాస్ టేలర్, టిమ్ సౌతీ, డరైన్ మిషెల్, సీఫెర్ట్, సాన్ట్నర్, కుగ్లీన్, సోధి, బెన్నెట్.